నగరాభివృద్ధి నలువైపులా విస్తరిస్తుండటంతో హైదరాబాద్ చుట్టూ భూముల్లో సిరులు పండుతున్నాయి. ఎకరాలే కాదు… గజాల్లోని ప్లాట్ల వేలానికి కూడా విశేష స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో హెచ్ఎండీఏ మొదటిదశగా నిర్వహించిన రెసిడెన్షియల్ ప్లాట్ల వేలంలో అంచనా మించి ఆదాయం వచ్చింది. చదరపు గజానికి రూ.10వేలుగా కనీస నిర్ణీత ధరను నిర్ధారించి, 300 చదరపు గజాల చొప్పున మొదటి విడతలో 50 ప్లాట్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 25 ప్లాట్లు, మధ్యాహ్నం 25 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించగా, గజానికి గరిష్ఠంగా రూ.27వేలు, కనిష్ఠంగా రూ.18 వేలు ధర పలికింది. వెరసి 15 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని 50 ప్లాట్ల వేలం ద్వారా రూ.15 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ ఆశించగా… రెట్టింపునకు మించి రూ.33.06 కోట్ల ఆదాయం సమకూరింది.
– సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): నగరాభివృద్ధి నలువైపులా విస్తరిస్తుండటంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతున్నది. ఎకరాలే కాదు… గజాల్లోని ప్లాట్ల వేలంకు సైతం భారీ ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న భూముల ఈ-వేలానికి విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల కోకాపేటలో ఎకరాల్లో చేపట్టిన ఈ-వేలంలో గరిష్ఠంగా ఎకరా ధర రూ.100 కోట్లు పలికిన విషయం తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా షాబాద్లో హెచ్ఎండీఏ మొదటి దశగా నిర్వహించిన రెసిడెన్షియల్ ప్లాట్ల వేలానికి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రధానంగా అధికారులు అత్యంత పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహించడంతో హెచ్ఎండీఏ నిర్ణయించిన కనీస నిర్ణీత ధర (అప్సెట్ ప్రైస్) కంటే రెట్టింపునకు పైగా ఆదాయం వచ్చింది. 15వేల గజాలకుగాను ప్రభుత్వ ఖజానాకు రూ.33.06 కోట్ల ఆదాయం సమకూరింది.
రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 311లో హెచ్ఎండీఏ సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ లేఅవుట్ను రూపొందించింది. మొదటి విడతలో 50 ప్లాట్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. 300 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఏర్పాటు చేసి… కనీస నిర్ణీత ధరను చదరపు గజానికి రూ.10వేలుగా నిర్ధారించారు.
ఈ మేరకు గత నెల 6న ఈ-వేలానికి నోటిఫికేషన్ ప్రకటించారు. ఈ నెల 4వ తేదీ వరకు బిడ్ల దాఖలుకు అవకాశం కల్పించారు. ప్రక్రియలో భాగంగా గత నెల 22న ప్రీబిడ్ సమావేశం నిర్వహించగా… బిడ్డర్ల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మంగళవారం ఉదయం 25 ప్లాట్లు, మధ్యాహ్నం మిగిలిన 25 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించారు. ఈ క్రమంలో గరిష్ఠంగా 84వ ప్లాటు నంబరు చదరపు గజానికి రూ.27వేల చొప్పున అంటే 270 శాతం మేర ధర పలికింది. కనిష్ఠంగా 96 నంబరు ప్లాటు రూ.18వేల (180 శాతం ఎక్కువ) ధర పలికింది. ముఖ్యంగా 96వ నంబరు ప్లాటు మినహా అన్ని ప్లాట్లు రూ.20వేల కంటే ఎక్కువ రూ.22వేల నుంచి 25వేల వరకు ధర పలకడం విశేషం. సరాసరి చదరపు గజం రూ.22,160 చొప్పున అమ్ముడుపోయాయి. ఈ క్రమంలో 15వేల చదరపు గజాల విస్తీర్ణంలోని 50 ప్లాట్ల వేలం ద్వారా రూ.15 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేయగా… దానికి మించి రూ.33.06 కోట్ల ఆదాయం సమకూరింది. మొదట నిర్వహించిన వేలం ప్రక్రియకు మంచి స్పందన రావడంతో తదుపరి దశలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.