సైదాబాద్, ఫిబ్రవరి 23 : ఐడేండ్ల బాలుడి అపహరణ కేసును సైదాబాద్ పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. రూ.10 వేలకు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. గురువారం సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ రూపేశ్ వివరాలు వెల్లడించారు. శివరాత్రి పండుగ సందర్భంగా శంకేశ్వరబజార్లోని శివాలయం వద్ద పార్ధ జంగయ్య, లక్ష్మి బిక్షాటన చేసుకోవడానికి వచ్చారు. బిక్షాటన చేసుకునే క్రమంలో వీరికి నల్గొండ జిల్లా లింగోటం గ్రామానికి చెందిన కడమంచి పాండు (28) పరిచయం అయ్యాడు.
ఈ క్రమంలో అతను మద్యం ఇప్పిస్తానని చెప్పడంతో లక్ష్మి తన కుమారుడు రామ్చరణ్ను తీసుకొని చంపాపేట రాఘవేంద్ర వైన్స్ వద్దకు వెళ్లింది. మద్యం సేవించిన మత్తులో లక్ష్మి ఉండగా, అమె వద్ద ఉన్న ఐదేండ్ల రామ్చరణ్ను పాండు తనతోపాటు ఎత్తుకెళ్లాడు. తన కుమారుడు కన్పించటం లేదని బాధితురాలు సైబాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అడిషనల్ ఇన్స్పెక్టర్ బండారు చంద్రమోహన్ నాలుగు ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీ తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా మామిళ్లగూడెం ఎస్ఎల్బీసీ కతల్గూడకు చెందిన స్క్రాప్ వ్యాపారి నర్సింహకు రూ.10వేలకు విక్రయించి, తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. పాండును అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో బాలుడిని విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసును ఛేదించడంలో పోలీసులకు సహకరించిన మణితేజ, జెస్పాల్ సింగ్, కిశోర్లను డీసీపీ అభినందించారు. నిందితుడు కడమంచి పాండు, నర్సింహ్మను అరెస్ట్చేశారు. బాలుడిని తల్లి లక్ష్మికి అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉన్నది. ఈ సమావేశంలో మలక్పేట ఏసీపీ శివశంకర్, సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ బండారు చంద్రమోహన్, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.