సైదాబాద్, మార్చి 4 : బంధువుల పెండ్లిలో పరిచయమైన ఓ అమ్మాయితో చాటింగ్ చేసి.. డబ్బులు, బంగారం ఇవ్వకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం… నెల రోజుల కిందట సైదాబాద్కు చెందిన ఓ బాలిక (17) కుటుంబ సభ్యులతో కలిసి బోయిన్పల్లిలో జరిగిన ఒక పెండ్లికి వెళ్లింది. బంధువులందరూ పెండ్లి వేడుకల్లో ఉన్న సమయంలో మహ్మద్ సుమైర్ అనే యువకుడు బాలికను పరిచయం చేసుకొని.. ఫోన్ నంబర్ను ఇవ్వాలని బలవంతం చేశాడు.
ఆమె ఇవ్వకపోవడంతో బంధువుల పిల్లల ద్వారా ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ను తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఫోన్, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తూ, ఇంటి పరిసరాల్లో సంచరించడం మొదలుపెట్టాడు. శుక్రవారం ఆర్ధరాత్రి ఇంటికి వచ్చి బాలికను మానసికంగా హింసించాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫోన్లో వేధించడం మొదలు పెట్టి.. బంగారం, డబ్బును ఇవ్వాలని.. లేకుంటే ఫొటోలను ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఒకవేళ బాలిక పెండ్లి చేసుకుంటే అక్కడికి కూడా వచ్చి పెండ్లిలో తన వద్ద నున్న ఫొటోలను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు.
ఇందుకు తన ఇంటికి రావాలని.. లేకుంటే డబ్బులు, బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆదివారం రాత్రి బాధితురాలు ఎవరికీ చెప్పలేక.. మానసికంగా బాధపడుతూ ఏడుస్తున్న విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. ఆమెను ప్రశ్నించడంతో విషయం చెప్పింది. తమ కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఫొటోలను ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిపై తగిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్ఐ నవీన్ తెలిపారు.