సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నగరంలో ఈ నెలాఖరు వరకు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న బస్సులు తుది మెరుగులు దిద్దుకునే దశలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు కావాల్సిన చార్జింగ్ పాయింట్లను కంటోన్మెంట్, మియాపూర్ డిపోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. కంటోన్మెంట్ డిపోకు తొలి విడుతగా 28 ఎలక్ట్రిక్ బస్సులు చేరుకుంటాయని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ బస్సులను తొలుత సికింద్రాబాద్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా.. మణికొండ, జేబీఎస్ నుంచి వయా ఉప్పల్ ఎక్స్రోడ్ మీదుగా ఇబ్రహీంపట్నం వరకు, సికింద్రాబాద్ నుంచి వయా రామ్నగర్ మీదుగా దిల్సుఖ్నగర్కు రూట్మ్యాప్ సిద్ధం చేశారు. ఆయా మార్గాల్లో ప్రయాణికుల రద్ధీ ఎక్కువగా ఉంటుందని, అందువల్ల తొలుత ఈ మూడు మార్గాల్లో బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో మియాపూర్ డిపో నుంచి మరో 36 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నారు.
నగర రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులను నడిపించడం వల్ల ప్రతి కిలోమీటర్పై ఖర్చు బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ఒక కిలోమీటర్కు డీజిల్ ఖర్చు రూ.18 అవుతున్నది. అదే ఎలక్ట్రిక్ బస్సుకు ప్రతి కిలోమీటర్కు అయ్యే చార్జింగ్ ఖర్చు రూ.6 అవుతుందని అధికారులు తెలిపారు. దీంతో ప్రతి కిలోమీటర్పై దాదాపు రూ.12 వరకు ఆర్టీసీకి ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ఆర్టీసీకి నిర్వహణ వ్యయం తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.