సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. ఔటర్ ఎక్కితే చాలు… ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఎక్కడికైనా వెళ్లేలా ఓఆర్ఆర్ అందుబాటులో ఉన్నది. ఓఆర్ఆర్పై ప్రజారవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని ఉమ్టా (హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ఫోర్ట్ అథారిటీ) కసరత్తు చేస్తున్నది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా సర్వేలు, అధ్యయనాలు చేపట్టారు.
ఈ నివేదికలు రూపొందించిన ఉమ్టా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేస్తున్నది. ఐటీ కారిడార్ నుంచి నేరుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు చేరుకునేలా ప్రజా రవాణా సాధనంగా మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం దీని నిర్మాణం ఆలస్యమవుతుండటంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయంగా ఔటర్ మీదుగా ప్రజా రవాణా కోసం బస్సులను నడిపే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఔటర్ రింగు రోడ్డుపై నగర వాసులు శంషాబాద్ నుంచి ఐటీ కారిడార్ వరకు నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రయాణ సాధనాలు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ప్రజా రవాణాకు సంబంధించిన వాహనాలను ఓఆర్ఆర్పై అనుమతించడం ద్వారా కోర్ సిటీలో ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని ఉమ్టా అధికారులు సూచిస్తున్నారు.
ప్రయాణికులు, వాహనాలపై అధ్యయనం..
ఐటీ కారిడార్లో కీలకంగా మారిన గచ్చిబౌలి కేంద్రంగా ప్రయాణికులు ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ వరకు, శంషాబాద్ నుంచి కోకాపేట మీదుగా పటాన్చెరువు వరకు, తిరిగి పటాన్చెరువు నుంచి ఐటీ కారిడార్, శంషాబాద్ వరకు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్న వారి వివరాలు, ప్రయాణికులను తీసుకువెళ్తున్న వాహనాలపై అధ్యయనం చేయిస్తున్నారు. ఇది పూర్తయితే ప్రతి రోజు ఎంత మంది ప్రయాణికులు, ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయన్న సమాచారాన్ని అంచనా వేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ అంచనాలతో కాలుష్య రహితంగా ఉండేందుకు వీలుగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపడం ద్వారా రెండు విధాలుగా మేలు జరిగేలా అవకాశం ఉన్నదని అధికారులు అంటున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిపాదించిన ఎయిర్ పోర్టు ప్రాజెక్టు సుమారు 31 కి.మీ. మేర ఉన్నది. దీనికి ప్రత్యామ్నాయంగా అదే రోడ్డు మార్గంలో బస్సుల రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో నడుపడం ద్వారా ప్రయాణికుల అవసరాలు తీర్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా.. వ్యక్తిగత వాహనాల వినియోగం, రోడ్లపై ట్రాఫిక్ను తగ్గించడంతోపాటు మెట్రో తరహాలోనే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను నడిపే అవకాశం ఉన్నదని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.
గచ్చిబౌలి- శంషాబాద్ మధ్య పెరిగిన ట్రాఫిక్…
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై రోజువారీ వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రతి రోజు ఓఆర్ఆర్పై సరాసరి 1.30 లక్షలకు పైగా వాహనాలు రాపోకలు సాగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో సగానికి పైగా వాహనాలు గచ్చిబౌలి నుంచి శంషాబాద్, శంషాబాద్ నుంచి పటాన్చెరువు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయని హెచ్ఎండీఏ వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల సేవలు లేకపోవడంతో ప్రజలు సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తున్నది. ఈ కారణంగానే వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతున్నది. వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల మీదుగా నడుపాలని హెచ్ఎండీఏ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే ఆర్టీసీ శంషాబాద్- గచ్చిబౌలిల మధ్య రూట్ నంబర్ 316 మినీ బస్సులను నడుపుతున్నారు. ఇదే తరహాలో శంషాబాద్ నుంచి పటాన్చెరువు వరకు ఆర్టీసీ బస్సులను నడుపడం ద్వారా ప్రయాణికుల అవసరాలు తీరతాయని భావిస్తున్నారు.