TSRTC | సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ యాజమాన్యం 2020లో కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన కార్గో లాజిస్టిక్ పార్సిల్ సర్వీసులకు రోజుకు రోజుకు ఆదరణ పెరుగుతున్నది. పార్సిళ్ల సంఖ్య పెరుగడంతో పాటు బల్క్ పార్సిళ్ల సదుపాయాన్ని కూడా ప్రజల సౌకర్యం కోసం ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకురావడంతో వ్యాపారాలు, కంపెనీలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సరుకుతో పాటు వ్యక్తిగత సరుకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించడానికి కార్గో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
సీఎం కేసీఆర్ ఆలోచనలో నుంచి ఉద్భవించిన ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరుకు రవాణా కోసం కార్గో ట్రాన్స్పోర్టు వాహనం, ఆర్టీసీ బస్సుల ద్వారా పార్సిళ్లను రవాణా చేయడం వంటి రెండు విధాలుగా కార్గో అందిస్తున్న సేవలు అందిస్తుంది. దాని వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రూ.36.36 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగలిగింది. ఆర్టీసీ తిరిగి లాభాల్లోకి రావడానికి కారణమవుతున్నది. 2022-23లో సరుకు పార్సిళ్లు, కొరియర్ వంటి సేవల ద్వారా రూ.16.78 కోట్ల ఆదాయం రాగా, ఇక కార్గో ట్రాన్స్పోర్టు వాహనాల ద్వారా రూ.19.58 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ కార్గో జీహెచ్ఎంసీ అధికారి మధుసూధన్ తెలిపారు. అయితే 2021-22 సంవత్సరంతో పోల్చితే ఇప్పటి వరకు రూ.6 కోట్ల వరకు అధిక ఆదాయం వచ్చిందన్నారు.
ఆర్టీసీ కార్గో లాజిస్టిక్, పార్సిల్ సర్వీసులలో కొత్తగా అంగన్ వాడీ కేంద్రాలకు పాలు రవాణా చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ఈ మేరకు కర్నాటక రాష్ర్టానికి చెందిన పాల ఉత్పత్తి సంస్థతో టీఎస్ఆర్టీసీ చర్చలు జరుపుతున్నది. అలాగే విద్యా శాఖ నుంచి పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు స్కూల్ పాయింట్లకు సరఫరా చేస్తున్నారు. మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సంఖ్యలో ఈ సర్వీసులను వినియోగించుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆర్టీసీ కార్గో లాజిస్టిక్ సర్వీసులను విస్తరించే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తున్నది.