హైదరాబాద్ : గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఆధ్వర్యంలో మరో కొత్త మార్గంలో మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులను నడిపించాలని జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి వెల్లడించారు. అందులో భాగంగానే మేడ్చల్ నుంచి కోకాపేట వరకు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులను నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.
మేడ్చల్ నుంచి వయా సుచిత్ర/డీపీఎల్ కాలనీ, బాలానగర్, కూకట్పల్లి, శిల్పారామం, గచ్చిబౌలి మీదుగా కోకాపేట్ చేరుకుంటుంది. ఈ నెల 16 నుంచి ఈ కొత్త సర్వీసు నగర ప్రయాణికులకు ముఖ్యంగా ఐటీ, ఐటీ అనుబంధ ఉద్యోగుల కోసం నడుపుతున్నట్లు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం మేడ్చల్ నుంచి 8 గంటలకు మెట్రో ఎక్స్ప్రెస్ బయలు దేరుతుందన్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు కోకాపేట్ నుంచి బయలుదేరుతుందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.