సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : లైసెన్స్ పొందాక.. ఓ మొక్క నాటాలంటూ.. రవాణా శాఖ అధికారులు నగరవాసులకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని కోరుతున్నారు. లైసెన్స్ పొంది వాహనంతో రోడ్డెక్కాల్సి వస్తుంది.. కాబట్టి కాలుష్యంలో సదరు వాహనదారుడు కూడా బాధ్యుడవుతాడు.
ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని రక్షించుకునే ఉద్దేశంతో లైసెన్స్ పొందే వ్యక్తి తన వంతు బాధ్యతగా ఒక మొక్క నాటాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ కొత్తగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో 3వేల వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు రోజుకు 700 మంది వరకు ఉంటున్నారు. ఎల్ఎల్ పొందిన వారు మొక్కలు నాటేలా అధికారులు హితబోధ చేస్తున్నారు. ఎల్ఎల్ఆర్లపై ‘తెలంగాణకు హరితహారం-ప్లాంట్ ఏ ట్రీ వెన్ యూ గెట్ ఎల్ఎల్)’ నినాదాన్ని ముద్రిస్తున్నారు. లెర్నింగ్ లైసెన్స్ పొందిన చాలామంది ఆ నినాదం చూసి మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.