రంగారెడ్డి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : ఇతర పార్టీల నేతల కోసం గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, క్వింటాలుకు రూ.500బోనస్ చెల్లించి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ మంగళవారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్కు వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరువు పరిస్థితులతో రైతులు కష్టాల్లో ఉండగా.. ప్రభుత్వం బాధిత రైతులకు ధైర్యం చెప్పే ఆలోచన కూడా చేయకపోవడం సిగ్గు చేటన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మద్దతు ధరతోపాటు రూ.500బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేల నష్ట పరిహారం అందించాలని, రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి రూ.15వేల సాయం అందించాలని, కౌలు రైతులకు సైతం అదే స్థాయిలో సాయం అందించాలన్నారు. 2లక్షల రుణమాఫీని అమలు చేయడంతోపాటు పశుగ్రాసం పంపిణీకి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కష్టాల్లో ఉన్న రైతులకు బాసటగా నిలిచేందుకు కేసీఆర్ రైతు ఉద్యమం ప్రారంభించడంతో కాంగ్రెస్ పాలకుల్లో వణుకు మొదలైందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 110 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నీ వైఫల్యాలేనని విమర్శించారు. కేసీఆర్ ఒక్కరోజు పర్యటనతోనే భయపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వరద కాల్వ, సాగర్ కాల్వలకు నీటిని విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణా రెడ్డి, ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ సప్పిడి లావణ్య రాజు, మాజీ సర్పంచు బాట సురేశ్, సప్పిడి లావణ్య, శ్రీలత, ప్రవీణ్, మధు, రాంరెడ్డి, నర్సింహ్మ, ప్రవీణ్, చంటి తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 2 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వరి ధాన్యానికి మద్దతు ధరపై అదనంగా రూ.500 బోనస్ ఈ సీజన్ నుంచే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం మేడ్చల్ కలెక్టరేట్లో బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.