బంజారాహిల్స్, జూన్ 26: పదిహేను ఏండ్లుగా పోలీసుల కళ్లు గప్పి చట్టానికి దొరక్కుండా తిరుగుతున్న రౌడీషీటర్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని సయ్యద్నగర్కు చెందిన అర్షద్అలీ అలియాస్ అర్షద్ ఖాన్(50) అనే వ్యక్తి 2003లో బంజారాహిల్స్లో మరో నలుగురితో కలిసి నవీన్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అదే సంవత్సరంలో నిజామాబాద్లోమరో వ్యక్తిని హత్య చేశాడు.
హుమాయున్నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో చోరీ కేసుల్లో సైతం అర్షద్ అలీ నిందితుడిగా ఉన్నాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అర్షద్ అలీని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మూడేళ్ల పాటు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు మహారాష్ట్రలోని పాలాఘర్ జిల్లాలోని వసాయ్ ప్రాంతానికి వెళ్లిపోయాడు.
అప్పటికే సయ్యద్నగర్లో భార్యా, పిల్లలు ఉండడంతో వారిని వదిలిపెట్టిన అర్షద్ మహారాష్ట్రలో మరో యువతిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయాడు. కాగా కొన్నాళ్ల తర్వాత బండ్లగూడ ప్రాంతంలోని ఓ చిరునామాతో తన పేరును సయ్యద్ షకీల్గా మార్చుకుని వెళ్లాడు. కాగా అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చి వెళ్తుండేవాడు.
కాగా 2010లో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో కత్తితో తిరుగుతున్నాడన్న ఆరోపణలపై అర్షద్ అలీ అలియాస్ షకీల్ మీద ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదయింది. కాగా అప్పటినుంచి ఆ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. అర్షద్ అలీ కోర్టుకు హాజరుకాకపోవడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అయితే అతడి అచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు ఆశలు వదులుకున్నారు. కాగా ఇటీవల పాత కేసుల దర్యాప్తు గురించి వెస్ట్జోన్ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పరారీలో ఉన్న అర్షద్ అలీ వ్యవహారం బయటకు వచ్చింది.
దీంతో తక్షణమే అతడిని అరెస్ట్ చేయాలని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సుహాసన్ ఆదేశాల మేరకు ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ ముజఫర్ అలీ, కానిస్టేబుల్ ఎన్.సుభాష్లతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సయ్యద్నగర్ ప్రాంతంలోని అర్షద్ అలీ స్నేహితులతో పాటు బంధువులపై నిఘా పెట్టడంతో పాటు అతడి రెండో భార్య వివరాలను సంపాదించారు. ఆమె కాల్డేటా ఇతర ఆధారాలతో మహారాష్ట్రకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం నిందితుడు అర్షద్ అలీని అరెస్ట్ చేశారు. పదిహేనేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న అర్షద్ అలీని పట్టుకున్న పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.