బంజారాహిల్స్, మే 9 : ప్రేమ వ్యవహారంలో సెటిల్మెంట్ చేస్తామంటూ పోలీసుల అవతారం ఎత్తి ముగ్గురు యువకులను కిడ్నాప్ చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్నగర్ ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే యువకుడు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రైవేటు ఉద్యోగినిగా పనిచేస్తూ గచ్చిబౌలి ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(22)ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు 9 నెలలు సహజీవనం చేశాడు.
అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో నిఖిల్ అమెతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ బాధిత యువతి గత ఏడాది ఏప్రిల్లో గచ్చిబౌలి పీఎస్లో కేసు పెట్టడంతో నిఖిల్ మీద కేసు నమోదయింది. కాగా కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పరారైన నిఖిల్ కొన్నాళ్ల తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. దీంతో ఎలాగైనా నిఖిల్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న యువతి ఖమ్మంలోని తన స్నేహితుల ద్వారా ఇద్దరు రౌడీషీటర్లను సంప్రదించింది.
రౌడీషీటర్లకు బాధిత యువతి నిఖిల్ సంగతి చూడాలని చెప్పింది. ఈ క్రమంలో నిఖిల్ స్నేహితుడు సాయిని కిడ్నాప్ చేశారు. తాము పోలీసులమని దబాయించారు. అనంతపురం పట్టణంలో తలదాచుకుంటున్న నిఖిల్ను, అతడి స్నేహితుడు మహేశ్ను తెచ్చి ఓ ఫాంహౌస్లో నిర్భందించారు. యువతిని మోసం చేసినందుకు రూ. 50 లక్షలు ఇవ్వాలని, లేకుంటే నిఖిల్తో పాటు మహేశ్ను చంపేస్తామంటూ రౌడీ గ్యాంగ్ బెదిరించింది. మహేశ్ను ఫామ్హౌజ్లోనే ఉంచి సాయిని, నిఖిల్ను పంపించడంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసి, మరికొంత డబ్బును కుటుంబసభ్యుల వద్ద నుంచి తీసుకున్న నిఖిల్.. రూ.13 లక్షలు రౌడీగ్యాంగ్కు చెల్లించగా, తమ ఆధీనంలో ఉన్న మహేశ్ను వదిలిపెట్టారు. కాగా, మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలంటూ ఇటీవల రౌడీ గ్యాంగ్ నుంచి అనేకసార్లు ఫోన్లు వస్తుండడంతో సాయి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. బంజారాహిల్స్ పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.