సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ రోగులకు శస్త్ర చికిత్సలో మరింత ఊరట లభించనున్నది. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఈనెల 18న ప్రారంభించిన రోబో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు ఎంఎన్జే డైరెక్టర్ డా.జయలత వెల్లడించారు. ఇప్పటికే రోబో శస్త్ర చికిత్సలపై 20 మంది నిష్ణాతులైన సర్జికల్ అంకాలజిస్టు నిపుణులకు శిక్షణ ప్రారంభమైందని, శిక్షణ పూర్తిచేసుకున్న వైద్యనిపుణులతో దశల వారీగా ఎంఎన్జేలో రోబో సర్జరీలను ప్రారంభించనున్నట్లు వివరించారు. మొన్నటి వరకు కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలు.. తెలంగాణ సర్కార్ చొరవతో ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందే నిరుపేద రోగులకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే నిమ్స్లో అందుబాటులోకి వచ్చిన రోబో సర్జరీలు.. రాబోయే నెలరోజుల్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో సైతం అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రతినెలా 250 నుంచి 300 సర్జరీలు..
ప్రస్తుతం ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో 250 నుంచి 300 వరకు క్యాన్సర్కు సంబంధించిన క్లిష్టమైన సర్జరీలు, సుమారు 1600 వరకు సాధారణ సర్జరీలు జరుగుతున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డా.జయలత తెలిపారు. ఇటీవల ప్రారంభించిన అంకాలజి బ్లాక్లో అందుబాటులోకి వచ్చిన 7 నూతన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ద్వారా ప్రతినెలా పెద్ద మొత్తంలో సర్జరీలు నిర్వహించడం సాధ్యమవుతుందని వివరించారు.
50 నుంచి 60కి పెరగనున్న క్లిష్టమైన శస్త్రచికిత్సలు..
ప్రస్తుతం మాడ్యులర్ థియేటర్స్ ద్వారా 250 నుంచి 300 వరకు నిర్వహిస్తున్న క్లిష్టమైన సర్జరీలు.. రోబో సేవలు అందుబాటులోకి వస్తే మరింత వేగవంతం కానున్నట్లు ఎంఎన్జే అధికారులు చెబుతున్నారు. రోబో ద్వారా అత్యంత క్లిష్టమైన సర్జరీలను సైతం సులభంగా చేయవచ్చని, ప్రతిరోజు కనీసం రెండు నుంచి మూడు అత్యంత క్లిష్టమైన సర్జరీలను రోబో ద్వారా చేయవచ్చని డా.జయలత తెలిపారు. ఫలితంగా ప్రతి నెలా అదనంగా మరో 50 నుంచి 60 క్లిష్టమైన సర్జరీలు చేసే వీలుంటుందని వివరించారు. ముఖ్యంగా హెడ్ అండ్ నెక్, లివర్, కిడ్నీ, థొరాసిక్, గైనిక్, స్టమక్ తదితర భాగాలకు వచ్చే సంబంధిత క్లిష్టమైన క్యాన్సర్ వ్యాధులకు రోబో ద్వారా సులభంగా సర్జీరీ చేసే వీలుంటుందని, ఈ వ్యాధులతో బాధపడే రోగులకు వేగవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనివల్ల రోగికి సకాలంలో చికిత్స అందించ గలుగుతామని వైద్యులు పేర్కొన్నారు.
20 రోజుల్లో ప్రారంభిస్తాం..
ఎంఎన్జే క్యాన్సర్ రీజినల్ ఇనిస్టిట్యూట్లో ఈనెల 18న రోబోను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. మరో 20 రోజుల్లో రోబో సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రోబో వల్ల నిరుపేద క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన, వేగవంతమైన శస్త్ర చికిత్సలు జరుగుతాయి. ఇప్పటికే మాడ్యులర్ థియేటర్స్ ద్వారా రికార్డు స్థాయిలో మేజర్ సర్జరీస్ చేస్తున్నాం. రోబో అందుబాటులోకి వస్తే రోజుకు రెండు నుంచి మూడు అత్యంత క్లిష్టమైన సర్జరీలను అదనంగా చేసే వీలు ఉంటుంది. దీని వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు నిరీక్షణ తప్పి, సకాలంలో చికిత్స అందుతుంది. దీంతో రోగి జీవితకాలం మరింత పెరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహకారంతో ఎంఎన్జే హాస్పిటల్ కార్పొరేట్కు ఏ మాత్రం తీసిపోని విధంగా సేవలందిస్తున్నది.
– ఎంఎన్జే డైరెక్టర్ డాక్టర్ జయలత