Akhanda 2 | నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ 2: తాండవం’ విడుదలైనప్పటి నుంచి చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. డిసెంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా, భక్తి, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ను ఎదుర్కొంది. అయినప్పటికీ సినిమాలోని డివోషనల్ కంటెంట్, బాలకృష్ణ పవర్ఫుల్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక నేపథ్యంతో రూపొందించిన సన్నివేశాలకు ప్రేక్షకులు మాత్రమే కాదు, పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించడం విశేషంగా మారింది.
థియేటర్లలో తొలి రోజుల స్పందన భిన్నంగా ఉన్నా, వర్డ్ ఆఫ్ మౌత్తో ఈ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్లింది. తాజా సమాచారం ప్రకారం ‘అఖండ 2’ దాదాపు రూ.100 కోట్ల షేర్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే తొలి రూ.100 కోట్ల షేర్ మూవీ కావడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ రికార్డుతో బాలయ్య మార్కెట్ మరోసారి బలంగా నిలబడిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై తాజాగా ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘అఖండ 2’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. తాజా టాక్ ప్రకారం జనవరి 9 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా, ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన పొందుతుందన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో భారీ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. వరుస హిట్లతో ఫామ్లో ఉన్న బాలయ్య, ‘అఖండ 2’ సక్సెస్ తర్వాత మరోసారి బాక్సాఫీస్పై దండయాత్ర చేయనున్నాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.