చాంద్రాయణగుట్ట: ఆరుగురు వ్యక్తులు మూడు ద్విచక్ర వాహనాలపై సుమారు రెండు కిలోమీటర్లు ఇద్దరిని వెంబడించి దారిదోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. తుక్కుగూడ లేమూరు గ్రామానికి చెందిన జి.సుధాకర్ (23), సురేష్ (24) బంధువులు. సుధాకర్ కారు డ్రైవర్గా పని చేస్తుండగా.. సురేష్ రైతు. అయితే ఈ ఇద్దరు ఈ నెల 9న రాత్రి 11 గంటల సమయంలో బిర్యానీ తినేందుకు షాహిన్నగర్ కు టీఎస్ 07ఎఫ్ 1328 పల్సర్ బైక్పై బయలుదేరారు. ఈ క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో మూడు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు వేగంగా దూసుకు రాగా సుధాకర్, సురేష్ ప్రయాణిస్తున్న బైక్ వారిలో ఒకరికి తగిలింది. దీంతో వెంటనే ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించి దాడికి యత్నించారు. తప్పించుకునే క్రమంలో సుధాకర్, సురేష్ ఎర్రకుంట చౌరస్తా మీదుగా జీఎం కాలనీలోని సోని గ్రూప్ కంపెనీ ఖాళీ స్థలం వైపు వెళ్లిపోయారు.
అయితే వారిని రెండు కిలోమీటర్లు వెంబడించిన ఆరుగురు దుండగులు దాడి చేసి గాయపరిచారు. అనంతరం సుధాకర్ జేబులో ఉన్న రూ.30 వేల నగదు, రెండు సెల్ఫోన్లు, పల్సర్ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఇదే విషయాన్ని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ, అదనపు ఇన్స్పెక్టర్ వీరయ్య బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం వేట మొదలుపెట్టారు. షాహిన్నగర్ మార్గంలో పల్సర్ వాహనాన్ని వదిలివెళ్లినట్లు గుర్తించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి సీసీ కెమెరాల సాయంతో దుండగుల కోసం గాలిస్తున్నారు.