సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని బాలాజీ బంగారు నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠా ఈనెల 24వ తేదీన హైదరాబాద్కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహారాష్ట్ర థానే ప్రాంతానికి చెందిన ఈ ముఠా సభ్యులు 24న హైదరాబాద్కు వచ్చి సికింద్రాబాద్లోని ప్యాట్నీ సెంటర్లో ఉన్న ఢిల్లీ లాడ్జీలో బస చేశారు. ఈ తర్వాత ఈ ముఠా సభ్యులు మూడు రోజులపాటు పాట్ మార్కెట్లో రెక్కీ నిర్వహించారు. దిల్సుఖ్నగర్లో ఉంటున్న ఈ ముఠాకు సంబంధించిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగానే బాలాజీ నగల దుకాణాన్ని ఎంచుకున్నారని పోలీసులు గుర్తించారు. చోరీ సమయంలో నలుగురు మాత్రమే దుకాణంలోకి ప్రవేశించి ఐదు నిమిషాల వ్యవధిలోనే పని పూర్తి చేసుకొని వెళ్లిపోయారని, మిగతా గ్యాంగ్ సభ్యులంగా దుకాణం బయట కాపుకాచినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ గ్యాంగ్ సభ్యులంతా ఆటోలో కూకట్పల్లికి వెళ్లి అక్కడి నుంచి బస్సులో మహారాష్ట్రకు పారిపోయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మార్కెట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు.