GHMC | సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఏ రోడ్డును చూసినా.. ఏ ప్రాంతంలో చూసినా గుంతలే..!! ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీ గా ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉంది. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి.
ఒకవైపు వర్షాకాలం సమీపించడం..మరోవైపు రహదారుల మరమ్మతులలో అధికారుల నిర్లక్ష్యం వహించడంతో చాలా చోట్ల రహదారులు దెబ్బతిని ఉన్నాయి. 20వేలకు పైగా పాట్హోల్స్ ఏర్పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేయ గా, మరమ్మతు పనులను చేపట్టడం లేదు. ఈ క్రమంలోనే నిత్యం వందలాది ఫిర్యాదులు జీహెచ్ఎంసీ టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదులు వస్తున్న అధికారులు స్పందించడం లేదు. దీంతో చాలా చోట్ల ప్రయాణీకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఐఆర్సీ నిబంధనలకు తూట్లు
జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. ఇందులో 2,846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6,167 కిలోమీటర్ల అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఇందులో 70 శాతం రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగానే 2024-25 సంవత్సరంలో రూ.1041.91 కోట్లతో 3806 రహదారుల పనులు చేపట్టగా, ఇందులో రూ. 485 కోట్ల నిధులు ఖర్చు చేసి 1680 చోట్లలో పనులు పూరిత చేశారు. 2126 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు ఇంజనీరింగ్ నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు.
ఈ క్రమంలోనే 709 కిలోమీటర్ల మేర ఉన్న సీఆర్ఎంపీ రోడ్లు మినహా మిగతా అన్ని రోడ్లు గుంతలమయంగానే ఉండడం గమనార్హం. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రకారం బీటీ రోడ్డు వేస్తే ఆరేళ్ల వరకు, ఆదే విధంగా సీసీ రోడ్డు అయితే 10 ఏళ్లు వరకు ఖరాబ్ కాకుండా ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే పూర్తిగా గుంతలు పడుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారులు, కాంట్రాక్టర్లు అవినీతిని పాల్పడుతుండడంతోనే రోడ్లు త్వరగా డ్యామేజ్ అవుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు.
ఈ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయం
బంజారాహిల్స్లోని ఏసీబీ క్వార్టర్స్, జూబ్లీహిల్స్, నానల్నగర్, మెహిదీపట్నం, షేక్పేట, ఫ్యారడైజ్, రాంగోపాల్పేట, మూసారంబాగ్, బాలానగర్, ఎర్రగడ్డ, బహదూర్పురా, ఎల్బీ నగర్, కుత్భుల్లాపూర్, పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి. నారాయణగూడ నుంచి రామంతాపూర్కు వెళ్లే ప్రయాణీకులు అరగంట పాటు నరకం చూపే రహదారిపై ప్రయాణం తప్పదు. అంబర్పేట ఛే నంబర్ చౌరస్తా నుంచి ముఖ్రం హోటల్ వరకు మోకాలలోతు గుంతలు ఏర్పడ్డాయి.
పంజాగుట్ట సాయిబాబ కాలనీ, డీడీ కాలనీ, నల్లకుంట కూడలి, జూబ్లిహిల్స్ ప్రశాసన్నగర్ తదితర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుండగా..వేరే రూట్ల నుంచి వెళుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. వాహనాలు కాస్తా స్పీడ్గా వెళితే స్కిడ్ అయి రైడర్లు కింద పడుతున్నారు. దీంతో వీలైనంత తర్వాత గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.