ఘట్కేసర్ : అతివేగానికి ఓ విద్యార్థి బలయ్యాడు.. స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లివస్తుండగా.. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఎంబీఐ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. హెల్మెట్ ధరించకపోవడంతోనే అతను మృతి చెందాడని, ఒకవేళ హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికి ఉండేవాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ చంద్రబాబు వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం, మండలింగాపూర్కు చెందిన జంగా గంగాధర్ కుమారుడు రాము(22) పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుడు గొర్రె మహేశ్(21) అదే కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఇద్దరు సంస్కృతి టౌన్షిప్లోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. శనివారం రాత్రి రాము.. మహేశ్తో కలిసి రాంపల్లిలో స్నేహితుడి జన్మదిన వేడుకలకు వెళ్లారు. రాత్రి 1.30 గంటలకు తిరిగి సంస్కృతి టౌన్షిప్కు ద్విచక్రవాహనం(టీఎస్09 ఎఫ్క్యూ5208)పై వస్తున్నారు. యంనంపేట రైల్వే బ్రిడ్జిపైకి రాగానే అతివేగంతో ఉన్న బైక్ అదుపుతప్పి కిందపడింది. వాహనం నడుపుతున్న రాము తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న మహేశ్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన మహేశ్ను జీడిమెట్లలోని క్యూర్ దవాఖానకు తరలించారు. అతి వేగం, అజాగ్రత్తగా వాహనం నడపటంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.