శామీర్పేట, సెప్టెంబర్ 28 : శామీర్పేట పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరోవ్యక్తి గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా స్తంభపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ (35), రాజేందర్(27) బంధువులు. అదే గ్రామానికి చెందిన వంశీతో కలిసి ముగ్గురు కారు (టీఎస్07 జీజీ5889)లో మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో శామీర్పేట పరిధి రాజీవ్ రహదారి మీదుగా జగిత్యాల్కు వెళ్తున్నారు. కారును రాజేందర్ వేగంగా డ్రైవింగ్ చేస్తూ రాజీవ్ రహదారిపై లారీ బే లేలో పార్కింగ్లో ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సుదర్శన్, రాజేందర్ అక్కడికక్కడే మరణించారు. వంశీకి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శవ పంచనామా అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సుదర్శన్ తండ్రి అనంతయ్య దుబాయ్ వెళ్లాడు. అనంతయ్యను శంషాబాద్ ఎయిర్ పోర్టులో దింపిన తర్వాత, తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవార్లూ ప్రయాణం చేయడం, కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. శామీర్పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.