కంటోన్మెంట్, మార్చి 28: కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగిన కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నె క్రిశాంక్, దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 8 వార్డులకు గాను ఒక వార్డులో ఆత్మీయ సమ్మేళనం జరిగిందన్నారు. మిగిలిన అన్ని వార్డుల్లో వచ్చే నెల 10వ తేదీ లోపు సమావేశాలు పూర్తి చేయాలని సూచించారు. 1వ వార్డులో ఏప్రిల్ 2న, 2వ వార్డులో 5న, 3వ వార్డులో 9న, 4వ వార్డులో 8న, 5వ వార్డులో 9న, 6వ వార్డులో 10న, 7వ వార్డులో 6వ తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. లబ్ధిదారులకు ఏప్రిల్ 4న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు మధుకర్, సదానంద్గౌడ్, మురళీయాదవ్, హరికృష్ణ, రూప, నర్సింహ, నర్సింహయాదవ్, తేజ్పాల్, సరిత, నరేందర్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, ఆనంద్బాబు, శ్రీనివాస్, శర్విన్, కిరణ్, శ్రీహరి,సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు హైదరాబాద్ ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్కుమార్ సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఎన్నికల సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే వారి నాడి తెలిసి సులభంగా విజయం వరిస్తుందన్నారు.
పార్టీ శ్రేణులు ఐక్యతతో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. కంటోన్మెంట్లోని నేతలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని, అప్పుడే విజయాలు కలుగుతాయన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు.