మేడ్చల్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ)/దుండిగల్: అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తున్నారు. ఇటీవల కీసర, బోడుప్పల్, మేడిపల్లి, కాప్రా, కుత్బుల్లాపూర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో 350 అక్రమ నిర్మాణాలను కూల్చినట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి వెల్లడించారు. కాగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇక్కడ ఎన్నికల సమయంలో సుమారు 450పైగా నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించిన అధికార యంత్రాంగం.. వాటిని తొలగించేందుకు భారీ కసరత్తే చేసింది. ఇందులో భాగంగా 270 మంది పోలీసు సిబ్బందితో పాటు 30 మంది వరకు రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణల కూల్చివేతల్లో పాల్గొన్నారు.
సర్వేనంబర్ 307,329,342లలోని సగానికిపైగా నిర్మాణాలను నేలమట్టం చేశారు. సర్వేనంబర్ 342లో సుమారు 100 ఎకరాలు, 307లోని ఎస్ఎఫ్సీ భూములు సుమారు 70 ఎకరాలు, 329/1లోని చింతల్కుంట చెరువు ఎఫ్టీఎల్లోని 10 ఎకరాలను ఆక్రమించిన వ్యక్తులు వాటిని 60 గజాల పాట్లుగా మలిచి ఒక్కొక్కటీ రూ.7 లక్షల నుంచి 10 లక్షల వరకు విక్రయించారు. అయితే కబ్జాదారులకు సార్వత్రిక ఎన్నికల సమయం కలిసొచ్చింది. సుమారు రెండు నెలలుగా అధికార యంత్రాంగం ఎన్నికల్లో విధుల్లో తలమునకలు కావడంతో ఇదే అదునుగా భావించి ఆక్రమణదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే పనిలో పడ్డారు. రెండు నెలల కాలంలోనే సర్వే నంబర్ 307,329, 329/1,342లల్లో 450పైగా ఇండ్లు వెలిశాయి. ఇదిలా ఉంటే గాజులరామారం పరిధిలోని అక్రమనిర్మాణాల కూల్చివేతలు ఆర్డీవో శ్యామ్ప్రసాద్ గుప్తా నేతృత్వంలో కొనసాగింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియలో మల్కాజిగిరి ఆర్డీవో శ్యామ్ప్రసాద్గుప్తా, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రహమాన్ఖాన్తో పాటు బాచుపల్లి, గండిమైసమ్మ-దుండిగల్, కూకట్పల్లి, బాలానగర్ మండలాలకు చెందిన సుమారు 30 మంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.తెల్లవారు జాము నుంచే పోలీసుల బలగాలతో కూల్చివేతలు మొదలుకావడంతో పేదప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లల భవిష్యత్ కోసం, ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం ఇంటి స్థలాలను కొనుగోలు చేశామని, వాటిని కూల్చివేయవద్దని అధికారులను బతిమిలాడుకున్నారు. అయినా బలవంతంగా ఇండ్లల్లోని సామన్లను ఖాళీ చేయించిన అధికారులు సాయంత్రం వరకు కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఆర్డీవో శ్యామ్ప్రసాద్గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని హెచ్చరించారు.