దుండిగల్, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ భగత్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్లోని మూడు కోతుల బొమ్మ చౌరస్తా వద్ద మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి పాలన చేతకాక పోవడంతో ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులతో, విద్యావ్యవస్థతో చేలగాటమాడుతున్నదని మండిపడ్డారు.
విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలన్నారు. సీఎం తన వైఖరి మార్చుకొని హెచ్సీయూ భూములను ఆక్రమించుకోవడం మానుకోవాలన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్… రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినదించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు నందీశ్వర్, బాచుపల్లి మండల కమిటీ సభ్యులు రాజేష్, వాసు, శివ, సిద్ధార్థ్, చందు ,అజయ్ పాల్గొన్నారు.