హైదరాబాద్ : రేపటి నుంచి (శనివారం) నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో అసెంబ్లీకి 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
ఎక్కువ మంది గుమికూడడం, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించ రాదని ఆయన సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, ప్రశాంతతకు భంగం కల్గించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ పరిసరాలలో వాకింగ్ చేసే వారు ఉదయం 7 గంటల లోపు వాకింగ్ ముగించుకోవాలని అసెంబ్లీ అధికారులు తెలిపారు. 7 గంటల తరువాత పోలీసు బందోబస్తు ఆంక్షలు ఉండడంతో, సామాన్య ప్రజలను అటు వైపు అనుమతించరని పేర్కొన్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ముగిసే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.