DRF | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన విషయం విదితమే. భారీ వర్షాలకు భాగ్యనగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు జీహెచ్ఎంసీ పరిధిలోని విపత్తు సహాయక బృందాలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో నిమగ్నమై నగర వాసులకు ఇబ్బందులు కలగకుండా డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. దీంతో డీఆర్ఎఫ్ బృందాలపై నగర వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
రోడ్లపై నిలిచిన నీరును ఎప్పటికప్పుడు తొలగిస్తూ, వాహనదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. నేలకొరిగిన చెట్లను తొలగించారు. భారీ వర్షంలోనూ ఇతర ఫిర్యాదులను కూడా పరిష్కరించి, హైదరాబాదీలకు అండగా నిలిచారు డీఆర్ఎఫ్ బృందాలు.
ఎల్బీ నగర్ జోన్, సనత్ నగర్, అమీర్పేట, లక్డీకాపూల్తో పాటు ఇతర ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు 24 గంటల పాటు పని చేశాయి. మలక్పేట, కోఠి, ఏషియన్ మాల్, నాలా చెరువు, ఉప్పల్ ప్రాంతాల్లో ఉప్పొంగిన వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా పంజాగుట్టకు చెందిన అవినాష్ తివారీ మాట్లాడుతూ.. నగరంలోని పలు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనడాన్ని ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. నగర పౌరులను సురక్షితంగా ఉంచేందుకు వారు చాలా కష్టపడ్డారని తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తివారీ పేర్కొన్నారు.