కుత్బుల్లాపూర్, నవంబర్ 9 : లాటరీ పద్ధతి ద్వారా మేడ్చల్ జిల్లాలో వైన్షాపు రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. మంగళవారం కుత్బుల్లాపూర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 1, 2021 నుంచి నవంబర్ 30, 2023 రెండు సంవత్సరాల వరకు వైన్షాపుల రిజర్వేషన్ ఖరారు చేసిన అనంతరం మేడ్చల్ సూపరిండెంటెంట్ పరిధిలో ఉన్న 114 ఏ4 వైన్షాపుల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎస్టీలకు 1, ఎస్సీలకు 5, గౌడ కులస్తులకు 11 షాపులను రిజర్వు చేసిన అనంతరం మిగిలిన 97 షాపులకు అన్ని వర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేటాయించే వైన్షాపుల ప్రక్రియను వీడియో తీయడం జరుగుతుందన్నారు. మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ షాపులతో పాటు మిగిలిన జనరల్ షాపులన్నింటికి రూ.2 లక్షల నాన్-రిఫండబుల్ రుసుముతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను మంగళవారం నుంచి ఈ నెల 18 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. 20న కొంపల్లిలోని కేవీఆర్ కన్వెన్షన్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు డ్రా ద్వారా ఎంపిక చేసి లైసెన్సులను ఇవ్వనున్నట్లు తెలిపారు.
పోలీస్స్టేషన్ వారీగా రిజర్వేషన్ ఇలా…
మేడ్చల్ ఎక్సైజ్ సూపరిండెంటెంట్ పరిధిలో ఉన్న బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోమొత్తం 40 మద్యం దుకాణాలకు గాను 35 జనరల్, 1 ఎస్టీ, 4గౌడ కులస్తులకు కేటాయించారు.
మేడ్చల్లో మొత్తం 30 మద్యం దుకాణాలు ఉండగా 23 జనరల్, 3 ఎస్సీ, 4 గౌడ కులస్తులకు, కుత్బుల్లాపూర్ పరిధిలో మొత్తం 44 మద్యం దుకాణాలు ఉండగా 39 జనరల్, 2 ఎస్సీ, 3 గౌడ కులస్తులకు కేటాయించామని అధికారులు వివరించారు.