కవాడిగూడ, ఆగస్టు 9: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నదని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో దేశవ్యాప్త కార్మిక ‘మహాపడావ్’ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. అన్ని కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర కార్మికులు, ఉద్యోగ, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్, ఎం. నర్సింహ, టీఎన్టీయూసీ ఆర్డీ చంద్రశేఖర్, సీఐటీయూ ఎస్.వెంకటేశ్, హెచ్ఎంఎస్ పి.నర్సయ్య, ఐఎఫ్టీయూ వి. ప్రవీణ్, వీవీ రత్నాకర్ రావు, అరుణ, ఆంజనేయులు, ఎం. శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలపై పెను భారం మోపిందని వారు ఆరోపించారు. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి, ప్రశ్నించే గొంతులను నొక్కి జైళ్లలో పెట్టి పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజానీకం చైతన్యంతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు సాయిబాబా, సూర్యం, సుదర్శన్ రావు, సాధినేని వెంకటేశ్వర్ రావు, ఎంకే బోస్, రెబ్బ రామారావు, ఆర్. జనార్దన్, భరత్, బి.వెంకటేశం, పశ్యపద్మ, టి.సాగర్, చంద్రశేఖర్, వెంకన్న, భాస్కర్, ప్రేమ్ పావనీ, కమతం యాదగిరి, కిషన్, వెంకటయ్య, జంగయ్య, బాబు, శ్రీనివాస్, ఉమర్ఖాన్, హసీనా బేగం, లక్ష్మీబాయి, కిష్టమ్మ, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం..
సిటీబ్యూరో,ఆగస్టు9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ హైదరాబాద్ డివిజన్ కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో కార్మిక, కర్షక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తలపెట్టిన రెండు రోజుల మహా ధర్నాలో భాగంగా బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు.