హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మూడు విడతల్లో ఇంజినీరింగ్ సీట్లను భర్తీచేస్తారు. ఎంసెట్ ఫలితాలు విడుదలైన శుక్రవారం నాడే షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. మొదటి విడత కౌన్సెలింగ్ ఈ నెల 21 నుంచి, రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 28 నుంచి, తుది విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 11 నుంచి ప్రారంభంకానున్నది.
జాయింట్ సీటు అలొకేషన్ అథారిటీ (జోసా)కు ముందు, ఆ తర్వాత కౌన్సెలింగ్లో భాగంగా సీట్లు మిగలకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా షెడ్యూల్ను రూపొందించారు. ఎంసెట్ తొలి వెయ్యి ర్యాంకర్లలో అత్యధికులు జోసా కౌన్సెలింగ్లో పాల్గొని, ఐఐటీల్లో సీట్లు పొందుతున్నారు. దాంతో ఇంజినీరింగ్ కాలేజీల్లోని వీరి సీట్లు మిగిలిపోతున్నాయి.
కావున, ఈసారి జోసా కౌన్సెలింగ్కు ముందు ఒక విడత, జోసా కౌన్సెలింగ్ సమయంలో రెండో విడత, జోసా కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత తుది విడత కౌన్సెలింగ్ చేపట్టేలా షెడ్యూల్ను ఖరారుచేశారు. సీట్లు పొందిన విద్యార్థులంతా అక్టోబర్ 17 నుంచి 21 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని వెల్లడించారు.