చార్మినార్, జనవరి 16: 400 ఏండ్ల నాటి హైదరాబాద్ నగర చరిత్రకు అద్దం పడుతూ నిలిచిన సజీవ సాక్ష్యం ఆ చార్మినార్ నిర్మాణం. మరి కొన్ని వందల ఏళ్ల పాటు ఆ నిర్మాణానికి ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా ప్రభుత్వ యంత్రాంగం రక్షణ చర్యలు చేపడుతున్నది. భవిష్యత్ తరాలు వాహ్ అంటూ.. నేటి ఈ రక్షణ చర్యలను స్మరించుకునేలా చారిత్రక కట్టడానికి వన్నెలద్దుతున్నారు. రేపటి తరాలకు ఈ చారిత్రక నిర్మాణాన్ని సజీవంగా అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
కాలుష్యంతో ముప్పు….
వందల ఏండ్ల క్రితం నిర్మించిన చార్మినార్ కట్టడంపై కాలుష్యం కాటు వేస్తుంది. మోటార్ వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్తో పాటు కార్బన్ మోనాక్సైడ్ల వల్ల చార్మినార్ కట్టడం ప్రస్తుతం మసకబారుతుంది. వాహనాల నుంచి వెలువడే ప్రమాదకరమైన కాలుష్యంతో పాటు గాలిలోని తేమ, నల్లటి తెరలతో కలిసి చార్మినార్ కట్టడానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి.
రసాయన ప్రక్రియ…
చార్మినార్ను కాలుష్యం నుంచి కాపాడుతూ మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. చార్మినార్కు ఏర్పడుతున్న నల్లటి చారలను ఎప్పటికప్పుడు తొలగించడానికి రసాయన ప్రక్రియను ప్రారంభించారు. చార్మినార్ మినార్లపై నుంచి బేస్ వరకు రసాయనాలతో చార్మినార్ను శుభ్రం చేస్తున్నారు.