హైదరాబాద్ : ఓ గర్భిణి నెలలు నిండకముందే బిడ్డకు జన్మనిచ్చింది. అనేక సమస్యలతో పుట్టిన ఆ పసికందుకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ సనత్నగర్లోని రెనోవా ఆస్పత్రిలో వెలుగు చూసింది.
హైదరాబాద్ మోతీ నగర్కు చెందిన టీ భ్రమరాంబిక.. గర్భం దాల్చింది. అయితే ఏడు నెలలకే ఆమె ప్రసవించింది. పాప బరువు కేవలం 720 గ్రాములే. అంతేకాకుండా శ్వాసకోశ సంబంధ సమస్యతో పాటు రక్తపోటు తగ్గడం, గుండెకు రక్తప్రసరణ తగ్గడం, అప్నీయా, ఆహారం పడకపోవడం, కల్చర్ నెగిటివ్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడుతోంది శిశువు. దీంతో రెనోవా ఆస్పత్రి వైద్యులు ఆ పాపకు రెండున్నర నెలల పాటు చికిత్స అందించి, ప్రాణాలతో కాపాడారు.
రెనోవా ఆసుపత్రికి చెందిన నియోనటాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాశ్ హెడ్డా నేతృత్వంలో పీడియాట్రిషియన్లు డాక్టర్ రుఖియా, డాక్టర్ సీహెచ్ వేణుగోపాల్రెడ్డిలు శిశువుకు వైద్యం అందించారు. ఇటువంటి ఆరోగ్య సమస్యలతో పుట్టిన శిశువులు 70-80 శాతం మాత్రమే బతికేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. తమ పాపను ప్రాణాలతో కాపాడిన రెనోవా ఆస్పత్రి వైద్యులకు భ్రమరాంభిక, ఆమె భర్త నరేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.