కవాడిగూడ, ఏప్రిల్ 29 : రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోతుల నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయలేని విధంగా కేంద్రం ఆదేశాలిస్తోందని అన్నారు. సీపీఎస్ రద్దుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు అనకుండా చేస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే పనులను మానుకోవాలని హితవుపలికారు. టీజీఈ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల సమస్యల పరిష్కరానికి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయూ నాయకులు వీఎస్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఉద్యోగుల, పెన్షనర్ల, కార్మికుల సంక్షేమం కోసం పనిచేయడం లేదని విమర్శించారు. కేవలం కార్పొరేట్లు, కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని దించే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవుపలికారు.
పోతుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలే కాకుండా ప్రభుత్వం దగ్గర ఉద్యోగులు పొదుపు చేసి దాచుకున్న పీఎఫ్, ఎల్ఐ డబ్బులు కూడా చెల్లించకపోవడంతో పెన్షనర్లు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. వెంటనే వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ అన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయిన వారికి సంవత్సరం గడుస్తున్నా పెన్షనర్ బెనిఫిట్ చెల్లించకపోవడం దారుణమని అన్నారు.