రంగం ఏదైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్కు తిరుగులేదు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మహానగరం దేశంలోని ఇతర మెట్రో నగరాలకు దీటుగా ఎదుగుతున్నది. ఆఫీస్ స్పేస్తో పాటు రిటైల్, నివాస, అద్దె గృహాల విషయంలో స్థిరమైన వృద్ధిరేటును కనబరుస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నది. ఆఫీస్, రిటైల్ స్పేస్, గృహ నిర్మాణాల్లో జేఎల్ఎల్ నివేదిక విడుదల చేసింది. కోల్కతా, ముంబై, పుణె, చెన్నైలో తగ్గుదల కనిపిస్తే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో మాత్రం వృద్ధి రేటు బాగుందని తన నివేదికలో పేర్కొంది. ఇక నివాస గృహాల విషయానికి వస్తే ఒక్క ఫిబ్రవరిలోనే మొత్తం 5274 యూనిట్లు రిజిస్ట్రేషన్లు కాగా వాటి విలువ రూ.2816 కోట్లుగా ఉందని నైట్ఫ్రాంక్ గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 1000-2000 స్కేర్ఫీట్ల విస్తీర్ణంతో ఉన్న ఫ్లాట్స్ అమ్మకాలు 68 శాతంగా ఉన్నాయని.. ఎక్కువ విలువ గలిగిన ఫ్లాట్లు 31శాతమేనని వివరించింది.
సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): నివాస గృహాల విక్రయాల్లో హైదరాబాద్ కేంద్రంగా మంచి వృద్ధి రేటు కనిపించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడింది. గురువారం విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్లో ఫిబ్రవరి నెలలో మొత్తం 5274 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి విలువ రూ.2816 కోట్లుగా ఉందని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొన్నది. 51శాతం నివాస గృహల రిజిస్ట్రేషన్ల విలువ రూ.25 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఎక్కువగా ఉన్నాయని, 68 శాతం అమ్మకాల్లో 1000-2000 చదరపు విస్తీర్ణంతో ఉన్న అపార్టుమెంట్లలోని ఫ్లాట్స్ అధికంగా ఉన్నాయి.
మధ్య స్థాయి నివాసాలు ఎక్కువగా ఉండగా, ఎక్కువ విలువ కలిగిన ఫ్లాట్ల శాతం 31 శాతంగా ఫిబ్రవరి-2023లో నమోదైందని నైట్ ఫ్రాంక్ నెలవారి నివేదికలో వెల్లడించారు. ఇక జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే రంగారెడ్డిలో 39 శాతం, మేడ్చల్-మల్కాజిగిరిలో 43 శాతం, హైదరాబాద్లో 15 శాతం, సంగారెడ్డిలో 3 శాతం రిజిస్ట్రేషన్లు అయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ తెలిపారు. ఒకవైపు గృహ రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లు పెరుగుతున్నా, హైదరాబాద్లో నివాస మార్కెట్ స్థిరంగా ఉంటూ, అధిక విలువ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో పెరుగుదల కనిపించిందని తెలిపారు.
మెట్రో నగరాలకు దీటుగా…
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ మహానగరం దేశంలోని ఇతర మెట్రో నగరాలకు దీటుగా, ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ వినియోగంలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తోందని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ అధ్యయన సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది. ఆఫీస్ స్పేస్తో పాటు రిటైల్, నివాస గృహాల అద్దెల విషయంలోనూ పెరుగుదలతో పాటు స్థిరమైన వృద్ధి రేటు ఉందని జేఎల్ఎల్ తన నివేదికలో పేర్కొన్నది. మూడు అంశాల్లో దేశంలోని 8 నగరాల్లో అధ్యయనం చేసి నివేదికను విడుదల చేశారు.
హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ను పెద్ద మొత్తంలో అద్దెకు తీసుకున్న కంపెనీల్లో అమెరికాకు చెందిన సెమీకండక్టర్స్ కంపెనీ మైక్రో చిప్ టెక్నాలజీ 1,68,000 చదరపు అడుగుల విస్తీర్ణం స్థలాన్ని కోకాపేటలోని గోల్డెన్ మైల్లో తీసుకుందని, ఏ గ్రేడ్ కమర్షియల్ టవర్గా కోకాపేట బిజినెస్ డిస్ట్రిక్లో ఉన్న దీని విలువ రూ. 175 కోట్లుగా ఉందని, కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఇది చాలా పెద్ద డీల్ అని పేర్కొన్నారు. అదేవిధంగా రిటైల్ స్పేస్లోనూ డిమాండ్ చాలా బాగుందని, ఇక గృహ నిర్మాణ కేటగిరీలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. కోల్కతాలో ముంబయి, పుణె, చెన్నైలో తగ్గుదల కనిపిస్తే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో మాత్రమే మూడు విభాగాల్లో వృద్ధి రేటులో పెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు.