లాక్డౌన్లోనూ ప్రగతికి ‘బాటలు’ పడుతున్నాయి. ఆ 20 గంటల సమయంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నది తెలంగాణ సర్కారు. ఒకవైపు కొవిడ్ కట్టడి చేస్తూనే.. ఫ్లైఓవర్లు, రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులను చకచకా కొనసాగిస్తున్నది. ట్రా‘ఫికర్’ లేకపోవడంతో పనుల్లో వేగం పెంచింది. ఇందులోభాగంగానే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు అనుసంధానంగా నిర్మించిన ర్యాంపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లోనూ త్వరలో ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇక్కడ సాధారణ రోజుల్లో ట్రాఫిక్ కష్టాలు మాములుగా ఉండదు. వరంగల్ జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాల రాకపోకలు విపరీతంగా ఉంటుంది. నారపల్లి నుంచి ఉప్పల్ కూడలి వరకు గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సిందే. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు సెంట్రల్ వాటర్ గ్రౌండ్ నుంచి పిర్జాదిగూడ రోడ్ వరకు ‘లింకు’ నిర్మిస్తున్నది హెచ్ఆర్డీసీఎల్. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పనులు పూర్తి చేస్తున్నది. ఈ నాలుగు లేన్ల రోడ్డు అందుబాటులోకి వస్తే ..నాగోల్ వైపు వెళ్లే వారు ఉప్పల్ జంక్షన్కు రావాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ కూడలిలో రద్దీ గణనీయంగా తగ్గుతుంది.
బండ్లగూడ: లాక్డౌన్ సమయాన్ని ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నది. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. కరోనా కట్టడి.. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే చర్యలను వేగవంతం చేస్తూనే..మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. 20 గంటల లాక్డౌన్ సమయంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా కార్యరూపంలో ఉన్న ఫ్లై ఓవర్లు, రహదారులు, రోడ్డు మరమ్మతు పనులను వేగిరం చేస్తున్నది. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నది.
పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు అనుసంధానంగా నిర్మించిన ర్యాంపులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే వెస్ట్ కారిడార్లో సుమారు రూ. 74 కోట్ల వ్యయంతో లింకు రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ జంక్షన్లో ట్రాఫిక్కు శాశ్వత విముక్తి కల్పిస్తూ హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనున్న లింకు రోడ్డు నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్న హెచ్ఆర్డీసీఎల్.. యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నది. వాహనాల రద్దీ లేకపోవడంతో పనుల్లో వేగం పెంచింది. సెంట్రల్ వాటర్ గ్రౌండ్ నుంచి పిర్జాదిగూడ రోడ్ వరకు రూ. 34కోట్లతో నిర్మిస్తున్న ఈ నాలుగు లేన్ల లింకు రోడ్డు నిర్మాణం పూర్తయితే నారపల్లి నుంచి ఉప్పల్ జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నాగోల్ వైపు వెళ్లే వారు ఉప్పల్ జంక్షన్కు రావాల్సిన అవసరం ఉండదు.
నగరం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు వీలుగా ఉన్న పీవీ ఎక్స్ప్రెస్ వేపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించిన రెండు ర్యాంపులను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్లతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ.22.08 కోట్ల వ్యయంతో అత్తాపూర్, ఉప్పర్పల్లి ప్రాంతంలో రెండు వైపులా ఈ ర్యాంపులను నిర్మించారు. వీటి ద్వారా వాహనదారులకు సమయ పాలనతో పాటు ఎంతో సౌకర్యంగా ఉంటుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్కుమార్, ఎమ్మెల్సీలు వాణిదేవి, యెగ్గే మల్లేశం, పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ సెక్రెటరీ బీఎ .సంతోష్, కార్పొరేటర్ సంగీత గౌరీ శంకర్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.