Hyderabad | అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ లేఅవుట్.. ఓవైపు గండిపేట చెరువు, మరోవైపు ఔటర్ రింగ్రోడ్డు.. ఆకాశహర్మ్యాలతో అద్భుతంగా కనిపించే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. భూగర్భ కేబుల్ వ్యవస్థ కారణంగా చెట్లు, మొక్కలు తప్ప ఎక్కడా ఒక్క కరెంటు స్తంభమైనా కనిపించని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. వాటి మధ్య కోకాపేట చెరువు.. ఇదీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన కోకాపేట నియోపొలిస్! ఇప్పుడు అక్కడి ఫేజ్-2లోని భూముల వేలం రికార్డుల మోత మోగించింది. ఎకరా రూ.100.75 కోట్లు పలికి దేశంలోనే అత్యధిక ధరగా నిలిచింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): భూముల వేలంలో కోకాపేట కేక పుట్టించింది. ఒక ఎకరానికి వంద కోట్లకు పైగా పలికి రికార్డుల మోత మోగించింది. ఇది దేశంలోనే అత్యధిక ధరగా నమోదైంది. ఒక లేఅవుట్లో ఎకరం స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన దాఖలాలు లేవని, కోల్కతా నగరంలో ఎకరం సుమారు రూ. 72 కోట్ల మేర మాత్రమే పలికిందని నిర్మాణ రంగ నిపుణులు తెలిపారు. కోకాపేట నియోపోలిస్ ఫేజ్-2లో గల 3.6 ఎకరాల ప్రైమ్ ప్లాట్ను హెచ్ఎండీఏ గురువారం వేలం వేసింది. ఆ స్థలాన్ని హ్యాపీ హైట్స్, రాజపుష్ప సంస్థలు కలిసి రూ.362.72 కోట్లకు దక్కించుకున్నాయి. ఈ చిన్న సైజు ప్లాటుకు సరిగ్గా గండిపేట లేక్ వ్యూ ఉండటం, ప్లాటుకు రెండు వైపులా విశాలమైన రహదారి, పక్కన విశాలమైన ఓపెన్ స్పేస్, ఔటర్ రింగురోడ్డుకు అతి సమీపంగా ఉండటంతో అనూహ్యమైన ధర పలికింది. ఈ స్థలంలో దాదాపు 45 అంతస్థుల వరకు హైరైజ్ భవనాలను నిర్మించి, కనీసం 210 వరకు ఫ్లాట్లను కట్టే అవకాశం ఉంది. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు దిగ్గజ స్థిరాస్తి కంపెనీలు పోటీ పడగా.. వాటిలో హైదరాబాద్కు చెందిన కంపెనీలే దక్కించుకోవడం మరో విశేషం.
భూముల వేలం హెచ్ఎండీఏకు మరోమారు కాసుల వర్షం కురిపించింది. కోకాపేట సర్వే నంబరు 239, 240లో రెండో దశ కింద మొత్తం 45.33 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని ఏడు ప్లాట్లుగా విక్రయించారు. ఈ వేలాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. ఒక్కో ప్లాట్ 3.60 నుంచి 9.71 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నిర్ణీత ధరగా రూ. 1586.50 కోట్లను నిర్ధారించి వేలం నిర్వహించగా మొత్తంగా రూ. 3,319.60 కోట్లు ఆర్జించినట్టు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఇందులో ఒక ఎకరానికి అత్యధికంగా రూ. 100.75 కోట్లు పలకగా, సగటున ఎకరం ధర రూ. 73.23 కోట్ల లెక్కన అమ్ముడైనట్టు వివరించారు. తొలి సెషన్లో 6, 7, 8, 9 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించగా.. అత్యధికంగా ఒక్కో ప్లాటుకు రూ. 68 కోట్ల నుంచి రూ. 75 కోట్ల వరకు పలికినట్టు వెల్లడించారు. 10, 11, 14 ప్లాట్లకు రెండో సెషన్లో ఈ వేలం నిర్వహించగా.. రికార్డు స్థాయిలో ధర పలికింది. ఇందులో అత్యధికంగా 10వ నంబరు ప్లాట్ ఎకరానికి రూ.100.75 కోట్లు పలకగా.. అతి తక్కువగా రూ. 67.25 కోట్లు పలికింది.
ఈ వేలం ప్రక్రియలో దిగ్గజ కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ స్థలంపై రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలకు చెందిన నిర్మాణ, పెట్టుబడి సంస్థలు ఆసక్తి చూపించాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, విశాలమైన రోడ్లు, ఇంటర్నల్ డ్రైనేజీ, పవర్ సప్లయ్ వంటి ఆధునిక వసతులతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేయగా… హార్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్గా ఉన్న వెస్ట్ సిటీలో ప్రాజెక్టు కావడంతో రెండో దఫా వేలానికి అనూహ్య స్పందన వచ్చిందని రియల్ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ స్టాండర్డ్ను ఈ వేలం ధరలు మరోమారు రుజువు చేశాయని హైదరాబాద్ క్రెడాయ్ శాఖ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెస్ట్ సిటీలో ఆకాశహర్మ్యాలు విస్తరిస్తున్న క్రమంలో.. నియోపోలీస్ స్థలాల కోసం బడా సంస్థలు పోటీపడినట్టు నిపుణులు చెప్తున్నారు.
కోకాపేట నియోపొలిస్.. హైదరాబాద్ మహానగరంలో సరికొత్త హాట్స్పాట్గా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో, దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ లేఅవుట్గా ఒకేసారి 530 ఎకరాల్లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఓ పక్క గండిపేట చెరువు, మరో పక్క ఔటర్ రింగు రోడ్డు.. అక్కడి నుంచి చూస్తే అద్బుతంగా కనిపించే ఐటీ కారిడార్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. దక్షిణ భారతంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాలు చూపరులకు కనువిందు చేస్తుంటాయి. కనుచూపు మేరలో గండిపేట జలాశయం, అదే తరహాలో ఎత్తయిన భవంతులు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల మధ్య కోకాపేట చెరువు కనిపిస్తుంది. ఇలా ఎన్నెన్నో ఆకర్షణలతో కోకాపేట నియోపోలీస్ లేఅవుట్ రూపుదిద్దుకున్నది. హెచ్ఎండీఏ అత్యంత విశాలమైన రహదారులతో లేఅవుట్ను నిర్మించింది. ఇందులో ప్రధాన రహదారులన్నీ 45 మీటర్లు (150 ఫీట్లు), 36 మీటర్లు (120 ఫీట్లు)గా నిర్మించడంతో పాటు కేబుల్స్ అన్ని అండర్గ్రౌండ్లోనే ఏర్పాటు చేశారు. దీంతో రోడ్ల వెంట చెట్లు, మొక్కలు తప్ప విద్యుత్తు స్థంభాలు, తీగలు కనిపించవు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిన వారంతా ఇదో ఆధునిక ఐటీ కారిడార్ అంటూ ప్రశంసిస్తున్నారు.