సిటీబ్యూరో, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ సీఎంకు లేఖ రాశారు. సూర్యాపేట, భువనగిరితోపాటు ఇటీవల 65 మంది బాల బాలికలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆత్మహత్యలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గు రుకులాల్లో పాలన నిర్వీర్యమైందన్నారు. దీని మూలంగా విద్యార్థుల చదువు, ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. పాము కాటుతో చనిపోతున్న వారు ఉన్నారని తెలిపారు. భువనగిరిలో అమ్మాయిని కొందరు చంపి.. దానిని కప్పిపుచ్చడానికి తల్లిదండ్రులపై బీసీ సంఘం నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
కొందరూ అధికారులు ఏళ్లుగా పాతుకుపోవడంతోనే నిర్లక్ష్యం పేరుకుపోతుందన్నారు. కీసర బీసీ గురుకులంలో విష పురుగుల సంచారం జరుగుతుందన్నారు. కాగజ్ నగర్ గురుకుల బాలికల పాఠశాలలో తలనొప్పితో బాధపడుతున్న విద్యార్థినికి మెరుగైన వైద్యం అందక చనిపోయిందని, కొమురం భీం, ఆసిఫాబాద్ బాలుర గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్తో 83 మంది అస్వస్థతకు గురయ్యారని లేఖలో పేర్కొన్నారు. బాటసింగారం బీసీ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి అనుమానాస్పదంగా ఉన్నదని, షాద్నగర్ గురుకుల పాఠశాలలో బాలుర వసతి గృహంలో ఎలుక కరవడంతో ఆసుపత్రి పాలయ్యారని, యాదాద్రి భువనగిరి బాలికల పాఠశాలలో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా లేఖలో ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.