సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్లో తొలి జాబితా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా టికెట్ రాని అసంతృప్తులు రోడ్డెక్కి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని నేతలంతా భగ్గుమంటున్నారు. గాంధీభవన్, బాపూఘాట్ వేదికగా ఆందోళనలు చేసిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు మంగళవారం ఏకంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం సాక్షిగా రేవంత్రెడ్డిని తూర్పారా పట్టారు. టికెట్ కేటాయించాలంటే ఒక్కో అభ్యర్థి వద్ద రూ.10 కోట్లు వసూలు చేస్తూ ఎన్నికలను అవినీతిమయం చేస్తున్నాడని రేవంత్రెడ్డిపై ఉప్పల్, బహదూర్ఫుర కాంగ్రెస్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, ఖలీల్బాబ తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. తొలుత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు ..ఒక్కో అభ్యర్థి నుంచి రూ.10కోట్లు, ఐదు ఎకరాల భూమిని లంచంగా తీసుకుంటున్నాడని, మేం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని రాగిడి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
ఇక గోషామహల్ టిక్కెటు ఆశించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వినయ్కుమార్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కన్నయ్యలాల్ సాహులు ప్రత్యేకంగా సమావేశమై రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు. గోషామహల్లో రేవంత్రెడ్డిని తిరగనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. ఖైరతాబాద్ నియోజకర్గానికి చెందిన సునీతరావుకు గోషామహల్ టికెట్ ఎలా కేటాయిస్తారని వారంతా భగ్గుమన్నారు. మహేశ్వరం, మేడ్చల్, సనత్నగర్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోనూ నిరసనల పర్వం కొనసాగుంది. రోజురోజుకు ముదురుతున్న టికెట్ లొల్లి ఆ పార్టీలో తీవ్ర దూమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబుకు రేవంత్రెడ్డి తాకట్టు పెడుతున్నారని నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు , రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై అసమ్మతి వర్గం అంతా ఒక్కటై చేస్తున్న నిరసనతో ఆ పార్టీలో అలజడి నెలకొన్నది.