మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 24: మేడ్చల్ జిల్లా పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు వివరించారు. హైదరాబాద్ నుంచి మంత్రి, సీఎస్ , హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, రాష్ట్ర ఉన్నత అధికారులు గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లా వ్యాప్తంగా 2350 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా 881 ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. ఇందులో 803 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేశామని, అన్ని సౌకర్యాలు కల్పించి అర్హులైన లబ్ధిదారులకు అందజేశామని వివరించారు. ప్రభుత్వం సూచించిన మేరకు ధరణి ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందని చెప్పారు. 58 జీవోకు జిల్లా వ్యాప్తంగా 38 వేల దరఖాస్తులు రాగా, 59 జీవోకు 28,280 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 58 జీవో దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని, డిసెంబర్ 5 వరకు పూర్తి చేస్తామని, 59 జీవోకు సంబంధించి డిసెంబర్ 10 వరకు పూర్తి చేసి వివరాలు సమర్పిస్తామని చెప్పారు.
ఇండ్ల పురోగతిపై నివేదిక సమర్పించాలి : కలెక్టర్
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పురోగతిపై నివేదిక సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాకు మంజూరు చేసిన ఇండ్ల సంఖ్య టెండర్ పూర్తి అయినవి, నిర్మాణం, ప్రారంభమైన ఇండ్లు, వివిధ దశల్లో ఉన్న ఇండ్ల వివరాలు, ఎంపిక అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యా నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.