మేడ్చల్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ప్రతి విద్యార్థి చదివేలా పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్)ను ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి విద్యాశాఖ ప్రారంభించనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 505 ప్రభుత్వ పాఠశాలల్లో పఠనోత్సవాన్ని వచ్చే నెల 31 వరకు కొనసాగించనున్నారు. విద్యార్థులకు చదవటం ఒక అలవాటుగా మారి ఇష్టంగా చదివేలా ప్రోత్సహించేందుకే రీడింగ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని విద్యాశాఖ రూపొందించింది. ఒకటి నుంచి 10 తరగతి విద్యార్థులను ప్రతిరోజు గంట పాటు ఉపాధ్యాయులు చదివించనున్నారు.
పుస్తక పఠనానికి గంట కేటాయింపు..
ప్రతి తరగతికి పుస్తక పఠనానికి గంట సమయం కేటాయించనున్నారు. పాఠశాలలో ప్రతి సబెక్టు ఉపాధ్యాయులు పుస్తక పఠనాన్ని నిర్వహించే బాధ్యతను తీసుకుంటారు. ప్రతిరోజు తప్పని సరిగా తాము బోధించే పాఠ్యాంశాన్ని 10 నిమిషాల పాటు చదివించాలి. చదివిన కీలక అంశంలో ముఖ్యమైన పదాలను గుర్తింపజేసే విధంగా విద్యార్థులతో రాయిస్తే తద్వారా పిల్లలకు చదవటం అలవాటుగా మారుతుంది. దీంతో పదాల ఆధారంగా పాఠ్యాంశాన్ని సులభంగా చదవగలిగే విధంగా చూస్తారు. పాఠ్యపుస్తకాలే కాకుండా వివిధ రకాల పుస్తకాలు, దిన పత్రికలను చదివే విధంగా ప్రణాళికను సిద్ధం చేశారు. పిల్లల్లో పోటీతత్వం పెంపొందించే క్రమంలో పఠన పోటీలను నిర్వహించనున్నారు. ప్రతి నెలలో మూడో శనివారం విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహిస్తారు. 6 నుంచి 9 వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, చదివిన పుస్తకాలు తీసుకునేలా విద్యార్థులకు బాధ్యతలను ఉపాధ్యాయులు అప్పగిస్తారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు పఠనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పఠనోత్సవ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. ఇప్పటికే పఠనోత్సవం పై ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి సారించింది. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం.
– విజయకుమారి, డీఈవో,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా