వ్యవసాయ యూనివర్సిటీ , జనవరి 9 : దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే అవకాశం రావడాన్ని విద్యార్థులు అదృష్టంగా భావించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఐసీఎం ఆడిటోరియంలో నెహ్రూ యువకేంద్ర సంఘటన్, కేంద్ర హోంశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఆదివాసి యువత సమ్మేళనం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్చువల్ పద్ధతిలో హాజరు కాగా.. మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న వ్యవసాయ పద్ధతులను మీ రాష్ర్టాలకు వెళ్లిన తర్వాత ప్రజలకు వివరించాలని సూచించారు. దశాబ్దాలుగా ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు ఉండేవి కాదని రాష్ట్రం సిద్ధించిన తర్వాత శరవేగంగా మార్పులు వస్తున్నాయని తెలిపారు. దేశంలో తెలంగాణకు చెందిన గిరిజనులు, ఆదివాసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు.
ఆదివాసీల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీల్లో విప్లవాత్మక మార్పు వచ్చిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం యువతకు సర్టిఫికెట్లు, షీల్డులు అందజేశారు. నెహ్రూ యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్ విజయరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చత్తీస్ఘడ్ , జార్ఖండ్, ఒడిస్సాకు చెందిన 220 మంది యువతీ, యువకులు పాల్గొన్నారు. ఫ్రొగ్రామ్ సూఫర్ వైజర్ కృష్ణారావు, వరంగల్ యూత్ ఆఫీసర్ అన్వేష్, నిజామాబాద్ శైలీ, రంగారెడ్డి ఈసయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు.