Congress | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికిన దివంగత తెలంగాణ నేత పి. జనార్దన్రెడ్డిని ఇప్పటికీ అభిమానించే వారిలో కాంగ్రెస్ కార్యకర్తలే కాదు.. సాధారణ ప్రజలు కూడా గణనీయంగా ఉంటారు. అంతెందుకు… సీఎం రేవంత్రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు సైతం పీజేఆర్ తెలంగాణ పోరాట పటిమను తమకు అనుకూలంగా చెప్పుకుంటూనే ఉన్నారు.
కానీ అలాంటి నేత వారసులకు మాత్రం హస్తం పార్టీ మోసం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీజేఆర్ కుమారుడిని పొగబెట్టి బయటికి పంపిన ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు ఆయన కుమార్తె, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి విజయారెడ్డికి దానం నాగేందర్ రూపంలో చెక్ పెట్టారు. పీజేఆర్ విషయంలో నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరిస్తున్న ఆ పార్టీ తీరు పట్ల సొంత శ్రేణులే గుర్రుగా ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా వెలుగొందిన ఖైరతాబాద్ నియోజకవర్గమంటేనే పి. జనార్దన్రెడ్డి (పీజేఆర్) పేరు గుర్తుకువస్తుంది. 2007లో పీజేఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయారు. బతికి ఉన్నంత వరకు కాంగ్రెస్ కండువా వీడని పీజేఆర్… తెలంగాణ ప్రయోజనాల కోసం సొంత పార్టీ ముఖ్యమంత్రిపైనే తిరుగుబావుటా ఎగురవేసిన నికార్సయిన రాజకీయ నాయకుడు. అందుకే ఆయన మరణించి దశాబ్దంన్నర అవుతున్నా.. నగర రాజకీయాల్లో అన్ని పార్టీలు సైతం పీజేఆర్ను కీర్తిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలకు ప్రతిఫలంగా పీజేఆర్ వారసులకు సముచిత స్థానం కల్పించాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అడుగడుగునా వారిని రాజకీయంగా అణచివేతకు గురి చేస్తున్నారనే ఆవేదన పీజేఆర్ అభిమానులను కలచివేస్తున్నది. పీజేఆర్ మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు పి.విష్ణువర్ధన్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో విష్ణువర్ధన్రెడ్డి ఖైరతాబాద్లో భాగంగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారు.
ఇక… 2014, 2018 ఎన్నికల్లో అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విష్ణువర్ధన్రెడ్డి ఓటమి చెందారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విష్ణుకు టికెట్ రాలేదు. దీంతో విష్ణు తీవ్ర మనో వేదనకు గురికాగా… పీజేఆర్ తెలంగాణకు చేసిన సేవల్ని గుర్తు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి, సముచిత స్థానాన్ని కల్పించింది. ఇలా పీజేఆర్ వారసుడికి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీవ్ర అన్యాయం చేసింది.
పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి చాలాకాలంగా ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని నమ్ముకుని ఉన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ను కూడా ముందుకు నడిపించడంతో ఎట్టకేలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వగా, ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఓడిపోయిన అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్చార్జీలుగా కొనసాగుతున్నట్లుగా ఇక్కడ కూడా విజయారెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ను కాంగ్రెస్లోకి తీసుకోవడంతో ఇప్పుడు ఆమెకు చెక్ పెట్టినట్లేనని పీజేఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా పీజేఆర్ శిష్యుడైన దానం నాగేందర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో విజయారెడ్డి పరిస్థితి ఏమిటనే ఆవేదన సాధారణ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నది. ఎన్నికలకు ముందు పీజేఆర్ కుమారుడికి పొగబెట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇప్పుడు ఎన్నికల తర్వాత కుమార్తెకు రాజకీయంగా క్లిష్టమైన పరిస్థితులు కల్పిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇలా మొత్తంగా నగర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన పీజేఆర్ ఆనవాళ్లు లేకుండా ఆయన వారసులకు చెక్ పెట్టే కుట్ర కాంగ్రెస్ పార్టీ నుంచే జరుగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.