ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “కష్టపడి చదివితే విజయం వరిస్తుంది. అర్హతను బట్టి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలి. సామాజిక అంశాలతోపాటు ప్రధాన వార్తా పత్రికల్లోని అంశాలను విశ్లేషించుకోవాలి. ప్రధానంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను చదవాలి.” అని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్రెడ్డి గార్డెన్లో సోమవారం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో జోగు ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు ప్రధాన వక్తగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి వేప అకాడమీ, హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం 10:45 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు.
‘నమస్తే తెలంగాణ’, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఉమ్మడి జిల్లా నుంచి పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం నుంచే బారులుదీరారు. వివిధ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులతోపాటు డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చి తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిపుణులు ఇచ్చిన సూచనలు నోట్ చేసుకున్నారు. వివిధ అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. నమస్తే తెలంగాణ సర్యూలేషన్ విభాగం వారు వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో తెలంగాణ చరిత్ర, నిపుణ, భారతదేశ జాగ్రఫీ వంటి పుస్తకాలను కొనుగోలు చేశారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతకు ఇటువంటి పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు భారీ స్థాయిలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని స్టడీ సర్కిళ్ల నిర్వాహకులు పేర్కొన్నారు. పోటీ పరీక్షల అవగాహన కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా అందించారు.
నిరంతరం చదవాలి..
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నిరంతరం అభ్యాసనపై దృష్టి పెట్టాలి. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న వారి కోసం ఇప్పటికే పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ యువతకు ఉద్యోగాలను ఎక్కువగా అందించాలనే లక్ష్యంగా ఇచ్చోడ, ఉట్నూరు ప్రాంతాల్లో 60 రోజులపాటు ప్రత్యేక శిక్షణనిచ్చాం. పోటీ పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్తోపాటు వ్యాయామం, దేహదారుఢ్య పరీక్షలపై విస్తృతంగా నిపుణులతో అవగాహన కల్పిస్తున్నాం. నిరుద్యోగ యువతకు ఇలాంటి అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగపడుతాయి. వక్తలు చెప్పిన ప్రతి అంశాన్ని ఉద్యోగార్థులు మననం చేసుకోవాలి.
-ఉదయ్కుమార్రెడ్డి, ఎస్పీ, ఆదిలాబాద్.
లక్ష్యానికి గురి పెట్టి ఉద్యోగం కొట్టాలి..
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. అభ్యర్థులు తమ అర్హతను బట్టి ఉద్యోగ ప్రయత్నం చేయాలి. నిత్యం సామాజిక అంశాలతోపాటు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చదివి విశ్లేషణ చేసుకోవాలి. మార్కెట్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆరో తరగతి నుంచి పదో తరగతిలోపు పాఠ్య పుస్తకాల్లోనే పూర్తి సమగ్ర సమాచారం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలకు హాజరయ్యే వారు తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ చరిత్ర, సైన్స్ ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్ షిప్, వర్తమాన అంశాలు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సామాజిక చరిత్ర వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రిపరేషన్లో పుస్తకం చదవడమే కాదు.. ప్రతి పాయింట్ను నోట్ చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా తిరిగి చదువుకోవడం ముఖ్యం. అభ్యర్థులు తప్పనిసరిగా సమయపాలన, స్టడీ మెటీరియల్, ఆహారం, నిద్ర, మానసిక సమతుల్యతకు ప్రాధాన్యతనివ్వాలి.
నమస్తే తెలంగాణలో ప్రతి బుధవారం వస్తున్న నిపుణ పేజీ ప్రతి ఒక్కరూ చదివితే అందులో అనేక అంశాలు ఉపయోగపడుతాయి. ప్రతిరోజు ఎన్ని గంటలు చదవాలో ముందే నిర్ణయించుకోవాలి. అభ్యర్థి ఒకే సబ్జెక్టు చదవకుండా మూడు గంటలకొకసారి మార్చి చదవాలి. ఇటీవల పోటీ పరీక్షల్లో చాలా ప్రశ్నలు సామాజిక అంశాలపై ముడిపడి ఉన్నాయి. ప్రశ్నల్లోని అర్థాన్ని అభ్యర్థులు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ప్రశ్న అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చదవాలి. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో హక్కులు చట్టాలు, విధులు, రాజ్యాంగ సవరణ, భారతదేశ చరిత్ర, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను స్టడీ చేసి దానికి గల కారణాలను విశ్లేషిస్తే అది ప్రతి అభ్యర్థికి ఒక స్టడీ గైడ్గా జీవితంలో గుర్తుండి పోతుంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, వివిధ స్వచ్ఛంద సంస్థలు పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయం. మా అకాడమీ ద్వారా ఇప్పటివరకు వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆ తృప్తి జీవితంలో మరచిపోలేనని గుర్తు చేసుకున్నారు.
– మల్లవరపు బాలలత, డైరెక్టర్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ .
చదవడమే కాదు.. గుర్తుంచుకోవడమూ ముఖ్యమే..
ఉద్యోగం సాధించాలనే కృతనిశ్చయంతో విద్యార్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఇందుకోసం చదువుతో పాటు జ్ఞాపకశక్తి కూడా ముఖ్యమే. ప్రస్తుతం పోటీ తీవ్రత ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు స్టడీ మెటీరియల్ను ఎంచుకొని ఇదివరకు ఉద్యోగాలు సాధించిన వారి సలహాలు తీసుకోవాలి. ఏ పరీక్షలకు ఏ సబ్జెక్టులు అవసరమో నిర్ణయించుకొని రోజూ మూడు సబ్జెక్టుల చొప్పున చదవాలి. చదివిన సబ్జెక్టు సాయంత్రం పరీక్ష రాయాలి. చదివిన సబ్జెక్టులో ఎంతవరకు అవగాహన పెంచుకున్నామనే ప్రశ్న వేసుకోవాలి. కొత్త, పాత విషయాలను బేరీజు వేసుకొని చదివి నోట్ చేసుకోవాలి. నిత్యం వంద ప్రశ్నలను తయారు చేసుకొని, వాటికి జవాబులను ప్రాక్టీసు చేయాలి. నిత్యం చదువులో సైక్లింగ్ సిస్టంను పాటించి నెగెటివ్ ఆలోచన నుంచి దూరం కావాలి. ప్రిపరేషన్లో ఓవర్కాన్ఫిడెన్స్ ఉండొద్దు. పొటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇది పెద్ద మైనస్. నిత్యం చదువులో సైక్లింగ్ సిస్టంను పాటించి నెగెటివ్ ఆలోచన నుంచి దూరం కావాలి. ఎంత చదివినా మాకు ఉద్యోగం రాదన్న భావన తొలగించుకొని, ఎందుకు ఉద్యోగం రాదో ప్రశ్న వేసుకొని అందుకు సిద్ధమై ముందుకెళ్లాలి. ఆత్మ విశ్వాసం కంటే ఏదీ గొప్పది కాదు. అది అభ్యర్థి మదిలో ఉంటే ఉద్యోగాలు వాటికవే వస్తాయి.
-డాక్టర్ సీఎస్ వేప, వేప అకాడమీ డైరెక్టర్.
ప్రభుత్వ లక్ష్యం నెరివేరినట్లే..
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా కొనసాగింది. ప్రభుత్వం ఇప్పటికే నీళ్లు, నిధుల కోసం ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి పథకాలను పూర్తి చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఉద్యోగాలపై ఉండడంతో తెలంగాణ చరిత్రలోనే 80వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైంది. కానిస్టేబుల్ ఉద్యోగాలు మొదలుకొని ఎస్ఐ, గ్రూప్-1, 2, 3, 4, డీఎస్సీ, టీఆర్టీ, తదితర ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న వారికి జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. నిరుద్యోగ అభ్యర్థులు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ఆదిలాబాద్లో అత్యధిక ఉద్యోగాలు సాధిస్తే మన జిల్లాకు మంచి పేరు వస్తుంది.
-జోగు ప్రేమేందర్, మున్సిపల్ చైర్మన్, ఆదిలాబాద్.
ఆకాశ్(ఆదిలాబాద్) : సార్.. చరిత్రలో గ్రంథాలు, శాసనాలు, ప్రాంతాలు ఎంత చదివినా బుర్రకు ఎక్కడం లేదు.. ఎలా చదవాలి ?
డాక్టర్ వేప : చరిత్రకు సంబంధించిన విషయాలు చదివినప్పుడు అర్థమైనట్లుగా అనిపిస్తాయి. తీరా బుక్ పక్కన పెట్టగానే మర్చిపోతారు. ఇలా కాకుండా ఉండాలంటే అభ్యర్థులు గ్రంథాలు, శాసనాలు వీటికి సంబంధించిన నోట్స్ను బుక్లో రాసుకోవాలి. వాటిని టైమ్ దొరికినప్పుడల్లా చదువుతూ ఉండాలి. రోజుకు కేవలం రెండు లేదా మూడింటిని చదివినట్ల యితే గుర్తు పెట్టుకోవడం చాలా సులభం.
జాబ్ కొట్టేందుకు మంచి అవకాశం..
రాష్ట్ర ప్రభుత్వం 80,039 ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తున్నది. జాబ్ల కోసం వేచి చూస్తున్న వారికి ఇదో మంచి అవకాశం. ఇప్పటికే జిల్లాలో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించాం. ఆదిలాబాద్ జిల్లాలో ఐదు వేల మందికి శిక్షణనిస్తున్నాం. యువత నిత్యం కష్టపడి చదవాలి. పోటీ పరీక్షలపై ఉద్యోగార్థులకు అండగా నిలిచి, ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, జోగు ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయం. గ్రూపు-1 ఉద్యోగాల నుంచి గ్రూపు-2, 4, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులకు ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయి.
– సిక్తా పట్నాయక్, కలెక్టర్, ఆదిలాబాద్.
సుధాలక్ష్మి (ఆదిలాబాద్) : మేడం.. నేను గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నా. ఎన్నిగంటల పాటు చదవాలి. పోటీ పరీక్షల్లో అడిగే సంవత్సరాలు, తేదీలు గుర్తుండడం లేదు. ఏం చేయాలి ?
బాలలత : గ్రూప్స్నకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు టైం మేనేజ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు. విషయంపై పట్టు సాధించ డం ముఖ్యం. ఒకే సబ్జెక్టును గంటలపాటు చదవకుండా రెండు మూడు సబ్జెక్టులను డివైడ్ చేసుకొని చదవాలి. అలా చదివినట్లయితే సబ్జెక్టు గుర్తుండిపోతుంది. ఓ రెండు గంటలు చదివిన తర్వాత కొంత సమయం విరామం తీసుకోవాలి. దీంతో మైండ్ రిలాక్స్ అవుతుంది. తర్వాత చదివినా అర్థం అవుతుంది.
ఆర్తి (గుడిహత్నూర్) : మేడం.. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలి ?
బాలలత : తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్రను అర్థం చేసుకోవడం చాలా సులభం. చరిత్రను మన కళ్లముందు జరిగిన దానితో పోల్చుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని పిక్చర్ల రూపంలో గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్న విషయాన్ని వెంటనే పునఃశ్చరణ చేసుకోవాలి.
నవ్య (కాల్వ) : మేడం.. నేను గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నా. ఒక్కో సబ్జెక్టును ఎలా ప్రిపేర్ కావాలి?
బాలలత : గ్రూప్స్కు సంబంధించిన సబ్జెక్టులకు సిలబస్ ఎక్కువగా ఉంటుంది. గ్రూప్-1 కానీ.. గ్రూప్-2కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సబ్జెక్టులను 2 లేదా 3 భాగాలుగా విభజించి చదవాలి. ఒకే సబ్జెక్టును రోజంతా చదివితే మర్చిపోయే అవకాశం ఉంటుంది. చదివిన సబ్జెక్టును రివైజ్ చేసుకోవాలి.