హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి భోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టమైన రంగం (Rangam) నేడు జరుగనుంది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించి.. అమ్మవారు భవిష్యవాణి పలకనుంది. రంగంలో అమ్మపలికే వాక్కు నిజమవుతుందని భక్తుల విశ్వాసం. భవిష్యవాణి అనంతరం అమ్మవారి.. అంబారి ఊరేగింపు వైభవంగా సాగనుంది. అంబారికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.
మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు సాయంత్రం వైభవంగా సాగనుంది. నగరంలోని దాదాపు 40కిపైగా ప్రాంతాల నుంచి ఫలహారం బండ్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. దీంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూర్తవుతుంది.