తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 20 : తెలుగు నాటక రంగానికి దుగ్గిరాల సోమేశ్వరరావు అకింత భావంతో సేవలు అందించారని, ఆయన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. దుగ్గిరాల సోమేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని ఏసీగార్డ్స్లోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో బుధవారం రంగస్థల ప్రముఖులు ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ, ఆచార్య జీఎస్ ప్రసాదరెడ్డి, అమరేంద్ర బొల్లంపల్లి, ఉప్పలూరి సుబ్బరాయశర్మ, డాక్టర్ కోట్ల హనుమంతరావులను నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రంగస్థల అధ్యాపకులు భాస్కర్ శివల్కర్, డాక్టర్ డీజీపీ శాస్త్రి, డీవీఎస్ రమణమూర్తి, డి.సత్యప్రభా ర్, సత్యవాణి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య ఎస్వీ రామారావుకు బూర్గుల సాహిత్య పురస్కారం
తెలంగాణ సారస్వతీ పరిషత్తులో బుధవారం సాయంత్రం ప్రముఖ సాహితీవేత్త బూర్గుల రంగనాథరావు పేరిట ఆయన కుమారుడు బూర్గుల లక్ష్మీకాంత్ ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య తదితరులు బుధవారం ఆచార్య ఎస్వీ రామారావుకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.