హైదరాబాద్ : ఈనెల 22 న నిర్వహించే అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవ రోజున 5వేల మంది కళాకారులతో ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్(Minister Talasani ) వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల చివరిరోజు జరిగే అమరవీరుల స్మారక కేంద్రం(Martyrs Memorial Centre) ప్రారంభోత్సవ కార్యక్రమంపై శనివారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభిస్తారని తెలిపారు. అంతకు ముందు బీ.ఆర్అంబేద్కర్ విగ్రహ వద్ద నుంచి దాదాపు ఐదు వేల మంది కళాకారులచే ర్యాలీ(Artist Rally) ఉంటుందని పేర్కొన్నారు. కళాకారుల తరువాత రెండు వేల మంది మహిళలు, పూణే నుంచి వచ్చే బ్యాండ్ కళాకారులు, వారి వెనుకే వేలాది మంది నగర వాసులు, కార్యకర్తల ఊరేగింపు ఉంటుందని అన్నారు. నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కార్లలో కాకుండా మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వస్తారని చెప్పారు.
చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మాట్లాడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం, ముఖ్యమంత్రి ఉపన్యాసం తర్వాత అద్భుతమైన డ్రోన్ షో(Drone Show) ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, కార్యదర్శులు శ్రీనివాస రాజు, శేషాద్రి, హైదరాబాద్ కమిషనర్ అమయ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, అడిషనల్ సీపీ విక్రమ్ జిత్ సింగ్ మాన్ తదితరులు పాల్గొన్నారు.