మణికొండ,ఫిబ్రవరి 24 : మూసీ సుందరీకరణకు భూములను స్వాధీనం చేసుకుంటామని రాజేంద్రనగర్ డివిజనల్ అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండిపేట, రాజేంద్రనగర్ రెవెన్యూ మండలాల పరిధిలో మొత్తం 83 ఎకరాల 10 గుంటల భూమి మూసీ సుందరీకరణ, ఎకో పార్కు ఏర్పాటు కోసం భూ సేకరణ చేపడుతున్నామన్నారు. ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు.
కిస్మత్పూర్, దర్గా ఖలీజ్ఖాన్ ప్రాంతాల్లో రెండు నోటిఫికేషన్లు ప్రకటించామన్నారు. హిమాయత్సాగర్ చెరువు దిగువ భాగంలో 500 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలకు అవకాశం లేదని నిబంధనలున్నాయన్నారు. చెరువు కింద నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. బండ్లగూడ జాగీర్, ఉప్పర్పల్లి పరిధిలోను భూ సేకరణ సర్వేలను త్వరలోనే చేపడుతామన్నారు. మధు రిడ్జ్పార్కు ఏ,బీ బ్లాక్ అపార్టుమెంట్లు కూడా 2016లో జీవో ప్రకారం 50 మీటర్ల బఫర్జోన్లో ఉందని ఆర్డీవో వెంకట్రెడ్డి తెలిపారు.
అన్ని అనుమతులు తీసుకుని నిర్మించినప్పటికి బఫర్జోన్లో ఉన్న నివాసాలకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంటామన్నారు. 2004లో 12 మీటర్లు, 2012లో 50 మీటర్లకు బఫర్ జోన్ పెరిగినప్పటికీ అప్పటి పరిస్థితుల్లో అధికారుల అనుమతితో నిర్మించినవేనని గుర్తుచేసిన ఆర్డీవో ఎవరికీ అన్యాయం జరగకుండా పాదర్శకంగా భూ సేకరణ చేపడుతామన్నారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోపు అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఎంజాయ్మెంట్ సర్వేలు చేసి నిర్మాణాలు గుర్తించి, పరిహారం బేరీజు వేస్తామన్నారు. గండిపేట తహసీల్దారు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.