సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): ప్రస్తుత వానాకాలానికి రూపొందించుకున్న ప్రణాళికల మేరకు పూర్తి స్థాయిలో సంసిద్ధతతో పని చేయాలని జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు ఆదేశించారు. ప్రగతిభవన్లో గురువారం జరిగిన జీహెచ్ఎంసీ సమీక్షా సమావేశలో మంత్రి కేటీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్నేండ్లుగా నగరంలో తక్కువ సమయంలోనే కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ సారి కూడా జీహెచ్ఎంసీ యంత్రాంగం ఎలాంటి పరిస్థితులపైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీలో ఉన్న వివిధ విభాగాల మధ్య సమన్వయంతో ముందుకు పోయేలా పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. నాలాల అభివృద్ధి కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీకి తగిన పరిపాలనా అనుమతులు ఇచ్చామని, ఈ మేరకు నాలాలపై క్యాపింగ్ లేదా ఫెన్సింగ్ వంటి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని కోరారు. వివిధ జోన్లలో ఉన్న నాలాల ఫెన్సింగ్ కార్యక్రమానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాలాల అభివృద్ధి పనులను మరింత వేగవంతం, సకాలంలో ఆయా పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను జీహెచ్ఎంసీ అందించడం ద్వారా ఎస్ఎన్డీపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం) మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. నాలాలకు సంబంధించిన కార్యక్రమాలను మేయర్, కమిషనర్ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జరిపిన తవ్వకాలకు అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాలలో భాగస్వాములైన వర్కింగ్ ఏజెన్సీలు, శాఖలకు ప్రత్యేకంగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు.
నగరంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని మంత్రి సూచించారు. హెల్త్, శానిటేషన్ విభాగాలు కలిసి పని చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో పారిశుధ్యానికి పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్, యాంటీ లార్వా వంటి కార్యక్రమాలను ఎంటమాలజీ విభాగం మరింత పెంచాలన్నారు. టీఎస్ బీపాస్తో పాటు ఎస్ఆర్డీపీ వంటి ఇతర కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఉప మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.