హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రెండు, మూడు రోజులుగా మేఘావృతమైన హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఈదురుగాలులతో చల్లబడింది. శనివారం రాత్రి ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని పలు రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాత్రి 12 గంటల వరకు నాచారంలో 11.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఉప్పల్లో 9 సెం.మీ., కాప్రాలో 8.4 సెం.మీ., సరూర్నగర్లో 7.7 సెం.మీ., సైదాబాద్లో 5.6 సెం.మీ., మల్లాపూర్లో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి మీరాలం మండి కూరగాయల మార్కెట్ నీట మునిగింది. తార్నాకలోని పలు కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఉప్పల్ నుంచి మౌలాలి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు వెళ్లే రోడ్డులో వర్షపు నీరు నిలిచింది. వర్షం కారణంగా రోడ్లపై తలెత్తిన సమస్యలను తొలగిచేందుకు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.