గాలి దుమారం.. వాన ప్రతాపం
పలు చోట్ల వడగండ్లు
శామీర్పేటలో అత్యధికంగా 4.8సెం.మీల వర్షపాతం
రాగల మరో మూడు రోజులు వానలు
పగలు ఎండతో తల్లడిల్లిన నగరవాసులు సాయంత్రం వాన రాకతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం సాయంత్రం ఈదురుగాలులు,ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా శామీర్పేట అలియాబాద్లో 4.8సెం.మీల వర్షపాతం నమోదైందని, రాగల మూడ్రోరోజులు వానలు కురిసే వీలుందని అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 40.2 డిగ్రీలు నమోదైంది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): నిప్పుల కుంపటిగా మారిన గ్రేటర్ గురువారం సాయం త్రం ఒక్కసారిగా చల్లబడింది. పగలు వరకు ఎండలు దంచికొట్టగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. రాత్రి 8గంటల వరకు శామీర్పేటలోని అలియాబాద్లో అత్యధికంగా 4.8 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజులు గ్రేటర్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు. కాగా, నాచారం హెచ్ఎంటీ నగర్లో ఓ ఇంటిపై పిడుగుపడటంతో రేకులు కూలీ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.