సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఇక పడదులే అని అనుకునేలోపే మహానగరంలో సోమవారం కూడా వాన కుండపోతగా కురిసింది. ఉదయం 11 గంటల నుంచి వర్షం దంచికొట్టడంతో వర్షపునీటి నాలాలు ఉప్పొంగాయి. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జోరు వానలోనే మాన్సూన్ బృందాలు రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించారు. అక్కడక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉత్తర దక్షిణ ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నగరానికి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
జంట జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద
మూసీలోకి 2212 క్యూసెక్కుల నీరు విడుదల
సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఉస్మాన్సాగర్కు 1000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి నాలుగు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి 1552 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. హిమాయత్నగర్కు ఎగువ నుంచి 600 క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 660 క్యూసెక్కుల నీరు మూసీలోకి చేర్చుతున్నారు. జంట జలాశయాల నుంచి 2212 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళ్తున్నదని, పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.