సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. మొన్నటి వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో కురిసిన జల్లుల వల్ల కొంత చల్లబడిన నగర వాతావరణం రెండు రోజులుగా మళ్లీ వేడెక్కుతోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోయి పొడిగాలులు వీస్తుండటంతో ఉక్కపోత పెరిగిపోయి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.1డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 25శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నగరంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో రాగల 48గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.