ఎడతెరిపి లేకుండా ముసురుతో పాటు మధ్య మధ్య కురుస్తున్న మోస్తారు నుంచి భారీ వర్షంతో ఎల్బీనగర్ నియోజకవర్గం తడిసి ముద్దయింది. కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. వర్షంనీటిలో అక్కడక్కడా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి సేవలందిస్తున్నాయి. రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించేందుకు వెనువెంటనే చర్యలు చేపడుతున్నారు.
ఎల్బీనగర్/మన్సూరాబాద్, జూలై 20: ఎల్బీనగర్ జోన్ పరిధిలో గురువారం వర్షం దంచి కొట్టింది. ఎల్బీనగర్లో అత్యధికంగా 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా విరాట్ నగర్లో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఉదయం నుండి ముసురుగానే ఉన్నా సాయంత్రానికి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిళ్లలోని అన్ని డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం వద్ద 47 మిల్లీమీటర్లు, మారుతీనగర్ మహిళా మండలి వద్ద 46.8 మిల్లిమీటర్లు, న్యూ నాగోలు కాలనీ సంక్షేమ సంఘం భవనం వద్ద 44 మిల్లీ మీటర్లు, రాక్ టౌన్ కాలనీలో 43.8 మిల్లీ మీటర్లు, బండ్లగూడ 42.8 మిల్లీ మీటర్లు, అలుకాపురి కాలనీలో 43.3 మిల్లీమీటర్లు, హయత్నగర్ భవానీకాలనీలో 33 మిల్లీమీటర్లు, లింగోజిగూడ వార్డు కార్యాలయం వద్ద 31.5 మిల్లీ మీటర్లు, విరాట్నగర్లో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆకాశం కారుమబ్బులతో నిండిపోగా పగలూరాత్రి తేడాలేకుండా పోయింది. వదలని వానతో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. వీధి వ్యాపారులు ఇంటికే పరిమితం అయ్యారు.
* వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళికల ప్రకారం 12 స్టాటిస్టికల్ టీం, 23 మోబైల్ వెహికిల్ టీంలు రంగంలోకి దిగా యి. జోన్ వ్యాప్తంగా మూడు సర్కిళ్లలో వరదనీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి రోడ్లపైన, లోతట్టు ప్రాంతాల్లో వరదనీటిని నాలాల్లోకి మళ్లించారు. నాలాల వద్ద వరదనీరు వెళ్లకుండా అడ్డుకునే చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తూ సాఫీగా వరదనీరు వెళ్లేలా చొరవ తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదనీరు కాలనీల్లోకి రావడంతో ఇబ్బందులు పడ్డారు. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పనులు చక్కదిద్దారు.
* మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మన్సూరాబాద్ డివిజన్ పరిధి గణేశ్నగర్, పనామా, మల్లికార్జుననగర్, హకీమాబాద్, చింతలకుంట, సరస్వతినగర్, మన్సూరాబాద్లోని ఆయిల్ మిల్ ప్రాంతం, చింతలకుంట రెయిన్బో ఆస్పత్రి వద్ద, ఆటోనగ ర్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు ఎదురుగా ఉన్న విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు నిలిచిపోయింది. ప్రభుత్వ యంత్రాగం, డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు సహాయకచర్యలను చేపడుతూ వరదనీటిని దారి మళ్లిస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి నాగోల్తో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి లోతట్టు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.
* భారీ వర్షంతో లింగోజిగూడ అల్తాఫ్నగర్లోని సుమారు 20 నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతానికి చేరుకుని వరదనీటిని తొలగించే పనులు చేయించారు. ప్రస్తుతం పరిస్థితి సాదరణంగా మారిందని స్థానికులు తెలిపారు.
మన్సూరాబాద్, జూలై 20: ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన వరదనీటి కాలువల పనుల వలన లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యకు పరిష్కారం లభించిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి వెంకటరమణ కాలనీ, మమతానగర్, నాగోల్ ఓల్డ్ విలేజ్లో జరుగుతున్న ఎస్ఎన్డీపీ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని.. బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యావసర వస్తువుల కోసం చిన్న పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు. ఎస్ఎన్డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పనుల కోసం తవ్విన మట్టిపై నుంచి నడిచే సమయంలో జారి నాలాల్లో పడే అవకాశం ఉంటుందని తెలిపారు. వరద నివారణ కోసం మ్యాన్హోళ్లను తెరిచి ఉంచ డం జరిగిందని రోడ్లపై ప్రయాణించే ప్రజలు, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలను సాగించాలని ఎమ్మెల్యే సూచించారు. భారీ వర్షం వలన ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాగం, డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
అధికారులను అప్రమత్తం చేశాం..
భారీ వర్షాల సూచనలు ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకురావొద్దు. ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా అన్ని సర్కిళ్ల అధికారులను అప్రమత్తం చేశాం. మాన్సూన్ టీంలు వర్షాలు కురిసిన ప్రాంతాల్లో విధుల్లో ఉన్నారు. ప్రజలు కూడా వాతవరణ శాఖ ఇస్తున్న సలహాలు పాటించి భారీ వర్షాలు ఉన్న సమయంలో ఇండ్లకే పరిమితం కావాలి. ప్రజలకు సేవలు అందించేందుకు 24 గంటలు సిబ్బంది సిద్దంగా ఉన్నారు.
– పంకజ (జడ్సీ, ఎల్బీనగర్)