హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. మాదాపూర్, గచ్చిబౌలి, చింతల్, బాలానగర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీలో వాన పడుతున్నది. హైదర్నగర్, ప్రగతినగర్, నిజాంపేట, బండ్లగూడ, సూరారం, బాచుపల్లితో పాటు తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షంతో పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. జంటనగరాల్లో 168 మాన్సూన్ బృందాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్రమట్టానికి తొమ్మిది మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.